మద్దూరు(కోస్గి), సెప్టెంబర్ 14 : కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న ఫార్మా విలేజ్ను అడ్డుకొని తీరుతామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన నారాయణపేట జిల్లా కోస్గిలో మీడియాతో మాట్లాడారు. ఏడు గ్రామాల పరిధిలో వేల ఎకరాల్లో ఫార్మాసిటీని నిర్మిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ కోసం ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గంలో 13 వేల ఎకరాలను కేటాయించిందని గుర్తుచేశారు. సిద్ధంగా ఉన్న స్థలంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేయకుండా కొడంగల్కు ఎందుకు తరలిస్తున్నారని సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు.
ఇప్పటికే స్థానిక రైతులు ఈ కంపెనీ రాకను వ్యతిరేకిస్తున్నారని, ఇప్పటికైనా ఫార్మా కంపెనీ ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కోస్గి పట్టణ సమీపంలో కాలుష్యకారక పరిశ్రమలను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఇంటిపై రౌడీలు దాడి చేయడాన్ని అందరూ ఖండించాలని అన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ బీఫాంపై గెలవాలని సవాల్ విసిరారు. కొడంగల్లో 30 శాతం మాత్రమే రుణమాఫీ జరిగిందని, పూర్తిస్థాయిలో అర్హులైన రైతులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.