హైదరాబాద్ | ప్రధాని మోదీ ( PM Modi ) పర్యటన నేపథ్యంలో బీజేపీలో కుటుంబ పాలనను ఎత్తిచూపుతూ హైదరాబాద్లో ఫ్లెక్సీలు వెలిశాయి. కుటుంబ పాలనకు వ్యతిరేకమంటూ తరచూ ప్రగల్భాలు పలికే మోదీ, బీజేపీ నేతలపై సెటైర్ వేస్తూ కాషాయ పార్టీ నేతలు, వాళ్ల వారసుల పేరిట పలువురు సికింద్రాబాద్ ( Secunderabad ) ప్రధాన రహదారుల్లో ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. పరివార్ వెల్కమ్స్ యూ మోదీజీ ( Parivar welcomes you Modi ji )అనే క్యాప్షన్తో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ ఫ్లెక్సీల్లో అమిత్ షా, మాధవరావ్ సింథియా, రాజ్నాథ్ సింగ్, యడ్యూరప్ప, నారాయణ్ రాణే, రమణ్ సింగ్, వసుంధర రాజే, ప్రమోద్ మహాజన్, గోపీనాథ్ ముండే.. వారి వారసులతోపాటు అదానీ, అబానీ వారసుల ఫొటోలతో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. కాగా, పెండింగ్ సమస్యలను పరిష్కరించిన తర్వాతనే తెలంగాణ గడ్డపై అడుగుపెట్టాలని తెలంగాణ సమాజం ప్రధాని మోదీని డిమాండ్ చేస్తోంది. తెలంగాణపై మోదీ రాజకీయ కక్ష గట్టారని విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి మోదీ ఆలోచించి ఉంటే కేంద్రంలో పదుల సంఖ్యలో రాష్ట్ర సమస్యలు పెండింగ్లో ఉండేవి కావని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రధాని మోదీ రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో #GobackModi అనే హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్గా మారింది.