హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ‘స్వచ్ఛ ఫిల్మోంకా మహోత్సవ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న లఘు చిత్రాల పోటీలకు రాష్ట్రం నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా 4,340 గ్రామ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు దరఖాస్తు చేసుకోగా.. తెలంగాణ నుంచే 1,394 దరఖాస్తులు వెళ్లాయి. రాష్ట్రంలో పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులు గ్రామాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపడం ఇందుకు ప్రధాన కారణం. ఈ పోటీల్లో పాల్గొనేందుకు గ్రామ పంచాయతీల్లో ప్లాస్టిక్, తడి, పొడి, ద్రవ్య వ్యర్థాల నిర్వహణ, ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రవేశపెట్టిన విధానాలపై 5 నిమిషాల నిడివి గల వీడియోను చిత్రీకరించి దరఖాస్తుతోపాటు ఆప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని రెండు క్యాటగిరీలుగా విభజించి ఒక్కో కేటగిరీలో మూడు ఉత్తమ వీడియోలకు నగదు బహుమతులు అందజేయనున్నారు. ఈ పోటీలకు విధించిన నిబంధనలు, అంశాలన్నీ పల్లె ప్రగతిలో చేపట్టినవే కావడంతో రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీల సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులు ఉత్సాహంగా వీడియోలు చిత్రీకరించి ఆప్లోడ్ చేశారు. ఫలితంగా అత్యధిక దరఖాస్తులతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 623 దరఖాస్తులతో ఏపీ ద్వితీయ స్థానంలో నిలువగా.. మిగిలిన ఏ రాష్ట్రంలోనూ దరఖాస్తుల సంఖ్య 300 దాటలేదు. దేశంలోనే అతిపెద్దదైన యూపీ నుంచి కూడా కేవలం 289 దరఖాస్తులే రావడం గమనార్హం.