నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 12 (నమస్తే తెలగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాల కుట్రలను ఛేదిస్తూ పర్యావరణ అనుమతులు సాధించడం సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధ్దికి నిదర్శనమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల తరుఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాలమూరుకు గ్రీన్సిగ్నల్ లభించడంతో దానిపై ఆధారపడి నిర్మాణంలో ఉన్న డిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు ఇబ్బందులు తొలిగినట్టేనని చెప్పా రు.
డిండి ఎత్తిపోతల ద్వారా నల్లగొండ జిల్లా లో 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలపైన దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయని పేర్కొన్నారు. శనివారం నల్లగొండలోని తన నివాసంలో సుఖేందర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని మొత్తం రెండు టీఎంసీల్లో అర టీఎంసీ సామర్థ్యంతో డిండి ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. త్వరలోనే పనులన్నీ పూర్తి చేసి, నీరందించేందుకు ప్రభుత్వం సంకల్పంతో ఉందని చెప్పారు. మరోవైపు కల్వకుర్తి లిఫ్ట్ పథకంలో రీ జనరేటర్ వాటర్తో మూడు, నాలుగేండ్లుగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు వరద వస్తుండడంతో.. డిండి అలుగు పారుతున్నదని చెప్పారు. డిండి ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల్లో నీటి వాటాలను తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. నదీ జలాల పంపకం పూర్తయితే ఇంకా వేగంగా నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.