హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధికి అడగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల తెలంగాణకు ఆర్థికంగా భారీ నష్టం జరిగిందని పేర్కొరు. ఈ హామీలను ఇంకెప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు. ఐటీఐఆర్ను రద్దు చేయడం వల్ల రాష్ట్రం ఏటా రూ.30 వేల కోట్ల ఆదాయాన్ని, తెలంగాణ యువత 60 వేల ఉద్యోగాలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల్లో కనీసం ఒక్కదానికి కూడా జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
యాసంగిలో రా రైస్ మాత్రమే కావాలంటూ తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురిచేయడం సబబు కాదని మండిపడ్డారు. ఇటీవల పలు రాష్ర్టాలకు వైద్య కళాశాలలు, ఐఐటీలు, ట్రిపుల్ఐటీలను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు కనీసం ఒక్కటి కూడా కేటాయించకపోవడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు. ముద్ర రుణాల విషయంలోనూ కేంద్రం కక్షసాధింపు ధోరణితో వ్యవహరించిందని, ఫలితంగా తెలంగాణలో వేల మంది చిన్న వ్యాపారులకు రుణాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్కు రానున్న మోదీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించే వారంతా కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరిపై మోదీని నిలదీయాలని శ్రీహరిరావు కోరారు.