కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఆమె సరస్వతి పుత్రిక.. అత్యంత ప్రతిష్టాత్మకమైన అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో సీటు కొట్టింది. అందరికీ ప్రేరణగా నిలిచింది. ఆమె ఎవరో తెలుసుకోవాలంటే ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లాల్సిందే..
బెజ్జూరు మండలం కుషేన్పల్లి గ్రామానికి చెందిన పడాల స్రవంతి.. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ(ఇబ్రహీంపట్నం, హైదరాబాద్)లో డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవల అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ నిర్వహించిన పీజీ ఎంట్రెన్స్లో స్రవంతి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఎంఏ ఎడ్యుకేషన్లో సీటు వచ్చినట్లు యూనివర్సిటీ వారు స్రవంతికి ఆఫర్ లెటర్ బుధవారం పంపించారు.
స్రవంతి చిన్నప్పట్నుంచే తన చదువుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేవారు. స్రవంతి తల్లి ఆశా వర్కర్ కావడంతో.. అన్ని విధాలా ఆమె చదువుకు సహకరించేది. ఉన్నత విద్యను చదివేందుకు ప్రోత్సహించేది. పదో తరగతి వరకు బెజ్జూరులోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో చదివి.. 8.3 గ్రేడ్ సాధించారు. ఆసిఫాబాద్ టీఎస్ మోడల్ స్కూల్లో ఇంటర్ చదివారు. ఇంటర్లో కూడా 856 మార్కులు సాధించి ప్రశంసలు పొందింది. బీఏ ఎకానమిక్స్లో 9.64 గ్రేడ్ పాయింట్లు సాధించింది. ఇక పోస్టు గ్రాడ్యుయేషన్ చదివేందుకు అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీలో సీటు కొట్టింది. దీంతో స్రవంతికి అటు కాలేజీ అధ్యాపకులు, ఇటు తల్లిదండ్రులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.