కరీంనగర్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో మరో అద్భుతమైన సేవలు ప్రారంభించారు. పీఎస్ఏ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ప్లాంటును మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ శుక్రవారం ప్రారంభించారు. ఇలాంటి ఆపత్కాలంలో ఇక్కడే ఆక్సిజన్ ఉత్పత్తి చేసి రోగులకు అందించడం గొప్ప విషయం. హైదరాబాద్లోని గాంధీ, టిమ్స్, ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కరీంనగర్లో మొదటిసారి అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్లాంటు ద్వారా అప్పటికప్పుడు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులకు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. 900 లీటర్స్ ఫర్ మినట్ కెపాసిటీ కలిగిన ఈ ప్లాంటు నుంచి రోజుకు 88 సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని ప్లాంటు సర్వీస్ మేనేజర్ బీ ప్రవీణ్కుమార్ తెలిపారు. కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ ట్యాంక్ ద్వారానే ప్రస్తుతం రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నారు. ఆక్సిజన్ జనరేట్ ప్లాంటు ప్రారంభమైన తర్వాత లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ప్రత్యామ్నాయంగా మారనున్నది. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటులో అయితే ట్యాంకర్ల ద్వారా తెచ్చి ఆక్సిజన్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఆక్సిజన్ జనరేటర్ ప్లాంటులో అయితే అప్పటికప్పుడు ఆక్సిజన్ ఉత్పత్తి చేసి నేరుగా రోగులకు అందించే వెసులుబాటు ఉన్నది. గాలిలో ఉండే 19.5 నుంచి 20 శాతం ఆక్సిజన్ను సంగ్రహిస్తుంది. తద్వారా సురక్షితమైన ఆక్సిజన్ను రోగులకు అందిస్తుంది. రూ.1.10 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంటును ఇలాంటి ఆపత్కాలంలో ప్రారంభించడం గొప్ప విషయం. శుక్రవారం మంత్రులు ప్రారంభించిన తర్వాతనే దీని సేవలు అందుబాటులోకి తెచ్చారు. కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన ఈ ఆక్సిజన్ జనరేట్ ప్లాంటుతో నిరుపేద రోగులకు విస్తృతమైన సేవలు అందించే అవకాశాలున్నాయి. కరోనాతో ఆరోగ్యం విషమించిన ఎందరో బాధితులకు ఈ దవాఖానలో సేవలు అందుతున్నాయి. ఇలాంటి వారికి ఈ ఆక్సిజన్ ప్లాంటు ఎంతగానో ఉపయోగపడనున్నది.