Sircilla | ఉమ్మడి పాలనలో సిరిసిల్ల.. ఉరిసిల్లగా ఉండేది. పొద్దున పేపర్ తెరిస్తే నేతన్నల ఆత్మహత్యల వార్తలే కనిపించేవి. ప్రభుత్వాల పట్టింపు లేక చేనేతల జీవితాలు ఛిద్రమైపోయాయి. బొంబాయి, భీవండి వంటి ప్రాంతాలకు నేత కుటుంబాలు వలసెల్లి పోయాయి. ఇక రాబోయే తరాలకు మగ్గం చప్పుడు వినిపించదేమో, నేత వృత్తి కనిపించదేమో అనే దారుణ పరిస్థితులు దాపురించాయి.
ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కేటీఆర్ రాకతో సిరిసిల్ల దశ తిరిగింది. చేనేతల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చింది. శ్రీరాజరాజేశ్వర, అన్నపూర్ణ ప్రాజెక్టులతోపాటు మల్కపేట రిజర్వాయర్తో బంగారు పంటలకు నెలవైంది. అన్ని రంగాల్లో నియోజకవర్గం ప్రగతి పరుగులు పెట్టింది. మొత్తంగా సిరిసిల్ల.. సిరులఖిల్లాగా మారింది.
కరీంనగర్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా, అన్నదాతలు, నేతన్నల ఆత్మహత్యలకు నిలయంగా మారిన సిరిసిల్ల.. నేడు మంత్రి కేటీఆర్ సారథ్యంలో అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. వ్యవసాయ, పారిశ్రామిక, చేనేత, విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులతో నంబర్వన్గా నిలిచింది. శ్రీరాజరాజేశ్వర, అన్నపూర్ణ ప్రాజెక్టులతోపాటు మల్కపేట రిజర్వాయర్, మిషన్ కాకతీయ ద్వారా నియోజకవర్గంలో మొత్తం 1.36 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
ఒకప్పుడు డిగ్రీ కాలేజీ మాత్రమే ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఇప్పుడు.. జాతీయ అంతర్జాతీయ కళాశాలలు ఏర్పాటయ్యాయి. వ్యవసాయ కళాశాల, పాలిటెక్నికల్ కళాశాల, జేఎన్జీయూ ఇంజినీరింగ్ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కళాశాల, రూ.16 కోట్లతో గంభీరావుపేటలో అత్యాధునిక కేజీ టు పీజీ క్యాంపస్ ఏర్పాటుచేశారు. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నెలకొల్పారు. సిరిసిల్ల దవాఖానను అన్ని ఆధునిక వసతులతో అప్గ్రేడ్ చేశారు. చీర్లవంచ గ్రామ పరిధిలో 366 ఎకరాల్లో రూ.90 కోట్లతో అక్వా పరిశ్రమ, నర్మాలలో 309 ఎకరాల్లో స్పెషల్ పుడ్ ప్రాసెసింగ్ జోన్, సిరిల్లలోని పెద్దూరులో రూ.174 కోట్లతో 60 ఎకరాల్లో అఫెరల్ పార్క్ ఏర్పాటుచేశారు. జిల్లెల్లలో కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌస్ నిర్మాణాలు చేపట్టారు. జాకీ, సమర్ఠ్ కుట్టు శిక్షణ కేంద్రాల్లో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఆయా కేంద్రాల ద్వారా దాదాపు 20 వేల మందికి ఉపాధి లభిస్తున్నది.
మంత్రి కేటీఆర్ నేతన్నలకు చేతినిండా పని కల్పించడంతోపాటు అన్ని రకాలుగా ప్రో త్సాహం అందిస్తున్నారు. నియోజకవర్గంలోని 30,252 మరమగ్గాలు, 204 చేనేత మగ్గాలకు జియోట్యాగింగ్ చేశారు. 904 మంది కార్మికులకు 3.70 కోట్లు మాఫీ అయ్యాయి. ఒక్కోకార్మికుడు నెలకు రూ.15 నుంచి 20 వేల వరకు వేతనం పొందే అవకాశం కల్పించారు. రూ.11.6 కోట్లతో 10,849 మరమగ్గాలను ఆధునీకరించారు. నేతన్న బీమా ప్రవేశపెట్టారు.
నేత కార్మికుడిని యజమానిగా మార్చాలన్న లక్ష్యంతో రూ.387.68 కోట్లతో 88 ఎకరాల్లో వీవింగ్ పార్క్ ఏర్పాటు చేశారు. టెక్స్పార్క్లో 119 చిన్న తరహా పరిశ్రమలకు రూ.24 కోట్ల విద్యుత్తు రాయితీ మంజూరు చేయించారు. సమీకృత కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాలు, సమీకృత మార్కెట్లు, గ్రంథాలయాలు, మహిళ సంఘల భవనాలు, రహదారులు నిర్మించారు. నియోజకవర్గంలో రూ.246.5 కోట్లతో 4,429 డబుల్ బెడ్రూం నిర్మాణాలకు అనుమతులు మంజూరు కాగా ఇందులో 3,219 నిర్మాణాలు పూర్తి చేశారు. వీటిలో ఇప్పటికే 1801 మంది లబ్ధిదారులకు కేటాయించారు.