హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఆహ్లాదకర వాతావరణంలో ఉత్తమ బోధనాపద్ధతులను అనుసరిస్తున్న హైదరాబాద్లోని ప్రఖ్యాత విద్యాసంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) మరో అరుదైన గుర్తింపును దక్కించుకున్నది. ద్విదశాబ్ది ఉత్సవాలకు ముందు జాతీయంగా, అంతర్జాతీయంగా సరికొత్త కీర్తి కిరీటాన్ని సొంతం చేసుకున్నది. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ప్రొగ్రామ్స్ ర్యాంకింగ్స్-22లో అంతర్జాతీయంగా 38వ ర్యాంక్, జాతీయంగా మొదటి ర్యాంక్ను సాధించింది. సోమవారం ఈ ర్యాంక్లను ప్రకటించారు. ప్రతిష్ఠాత్మక మేనేజ్మెంట్ సంస్థలను వెనక్కినెట్టి ఐఎస్బీ ఈ ఘనతను చేజిక్కించుకున్నది. గత ఏడాది ఈ ర్యాంకుల్లో అంతర్జాతీయంగా 64వ ర్యాంక్ను సొంతం చేసుకున్న ఐఎస్బీ తాజాగా తన ర్యాంక్ను 38వ స్థానానికి మెరుగుపర్చుకున్నది. మొత్తం 49 వేల మంది ఎగ్జిక్యూటివ్స్కు శిక్షణనివ్వడం ద్వారా ఐఎస్బీ ఈ ర్యాంకింగ్స్ను పొందగలిగిందని ఐఎస్బీ డిప్యూటీ డీన్, ఎడ్యుకేషన్ అండ్ డిజిటల్ ఇనీషియేటివ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెసర్ దీపామణి తెలిపారు. దీంతోపాటు ఫ్యూచర్ యూజ్ ర్యాంకింగ్స్లో ఐఎస్బీ అంతర్జాతీయంగా 7వ ర్యాంక్ను సొంతం చేసుకున్నదని వెల్లడించారు.
విశ్వయవనికపై సత్తా చాటుకున్నాం
ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో ఐఎస్బీకి జాతీయంగా మొదటి ర్యాంక్, అంతర్జాతీయంగా 38వ స్థానం దక్కడం చాలా సంతోషదాయకం. రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్లో మన సత్తాను విశ్వయవనికపై చాటేందుకు ఈ ర్యాంక్ దోహదం చేస్తుంది. – ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల