హుజూరాబాద్ టౌన్ : ముదిరాజ్లను రాజకీయంగా ముంచింది ముమ్మాటికీ ఈటల రాజేందరేనని ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ (Kolipaka Sammayya Mudiraj ) ఆరోపించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా సీఎం కేసీఆర్( CM KCR ) నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ముదిరాజ్ లను మత్స్యకారులు గా గుర్తించారని అన్నారు.
ముదిరాజ్ల జీవన ఆధారాలైన చెరువులు, కుంటల పునరుద్ధరణ, ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. వాగులపై చెక్ డ్యాం (Check dam ) లు నిర్మించి మత్స్యకారుల బీమాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి నీలి విప్లవానికి నాంది పలికారని తెలిపారు. ముదిరాజ్ల పక్షపాతిగా నిలిచిన కేసీఆర్కే ముదిరాజ్ల మద్దతు ( Support ) ఉంటుందని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ (Etala Rajender ) ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు ముదిరాజ్లకు జరిగే అన్యాయాలపై ఏనాడు కూడా పెదవి విప్పలేదని, నేడు కులాన్ని అడ్డుపెట్టుకుని కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎన్నికలప్పుడే పుట్టుకొచ్చే కొంతమంది నాయకులను రెచ్చగొడుతూ ముదిరాజ్ల ఐకమత్యాన్ని దెబ్బతీయాలని అంతర్గతంగా ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. ఇక ఈటలను నమ్మే స్థితిలో ముదిరాజ్లు లేరని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంలో ముదిరాజ్లను బీసీ-డీ నుంచి బీసీ- ఏ ( BC-A) లోకి తెచ్చిన జీవోఎంఎస్ నంబర్ 15 రద్దయినపుడు ఈటలకు ముదిరాజ్లు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడు ముదిరాజులను రాజకీయంగా అభివృద్ధి చేయాలని అనిపించ లేదా ? అని నిలదీశారు. స్వార్థంతో రాజకీయంగా వాడుకొని ముదిరాజులను ఎదగకుండా చేశారని ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఏకతాటిపై ఉన్న ముదిరాజ్లను స్వరాష్ట్రంలో గ్రూపులుగా విచ్ఛిన్నం చేసిన పాపం ఈటలది కాదా? అని ప్రశ్నించారు. ఆదరించి అవకాశాలు ఇచ్చిన సీఎం కేసీఆర్ను, ఎన్నో సార్లు నమ్మి ఓట్లేసి గెలిపించిన హుజూరాబాద్ (Hujurabad) ప్రజలను నట్టేట్లో ముంచిన ఈటలకు ఈసారి హుజూరాబాద్ ప్రజలు బై బై చెప్పాలనుకుంటున్నారని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిలో హుజూరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి (Padi Kaushik Reddy) పై ఈటల పోటీ చేయకపోవడమే మంచిదని హితవు పలికారు.