హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ దిగుబడులకు రైతు ఉత్పత్తి సంఘాల (ఎఫ్పీవోల) ద్వారా అన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో సందీప్కుమార్ సుల్తానియా వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన రాజేంద్రనగర్లోని గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఎఫ్పీవోలు, ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.
ఎఫ్పీవోల ద్వారా వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఫ్లిప్కార్ట్ ముందుకొచ్చింది. వీటిని ‘సమృద్ధి తెలంగాణ’ బ్రాండ్ పేరిట మార్కెట్లో విక్రయించనున్నట్టు తెలిపింది. రైతుల నుంచి వీటిని సేకరించే బాధ్యతను ఎఫ్పీవోలు తీసుకోవాలని, తమకు సరఫరా చేసే సరుకులో నాణ్యత ఉండేలా చూడాలని ఫ్లిప్కార్ట్ కోరింది.
ఎఫ్పీసీలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ముందుకొచ్చింది. మరోవైపు ఖమ్మం జిల్లాతోపాటు మరో నాలుగు జిల్లాల్లో రైతుల నుంచి 10 వేల టన్నుల మిర్చిని సేకరించనున్నట్టు ప్లాంట్ లిపిడ్స్ సంస్థ ఏజీఎం ఆదిత్యన్ తెలిపారు. దీని విలువ దాదాపుగా రూ.200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. సమావేశంలో సెర్ప్ డైరెక్టర్ రజిత, డీపీఎంలు, అడిషనల్ డీఆర్డీవోలు, రాష్ట్రంలోని 58 ఎఫ్పీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.