Lasya Nanditha | సంగారెడ్డి, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసు దర్యాప్తులో భాగంగా.. శనివారం పటాన్చెరు డీఎస్పీ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సికింద్రాబాద్లోని ఆమె నివాసానికి వెళ్లి.. తల్లి, అక్కతోపాటు ఆమె కూతరు నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. లాస్య తల్లి స్టేట్మెంట్ ప్రకారం.. ‘నేను, నా కూతురు లాస్యనందిత, మనవరాలుతో కలిసి గురువారం రాత్రి కారులో సదాశిపేట మండలం ఆరూర్ సమీపంలోని మిస్కన్షాబాబా దర్గాకు వె ళ్లాం.
దర్గాలో ప్రార్థనల అనంతరం ఆరూర్ నుంచి బయలుదేరి శుక్రవారం వేకువజామున 3.30 నుంచి 4 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్లోని ఇంటికి చేరుకున్నాం. ఇంటికి చేరుకున్నాక లాస్య నందిత అల్పాహారం కోసం కారులో డ్రైవర్ ఆకాశ్తో కలిసి సంగారెడ్డి వైపు వెళ్లింది. ఈ క్రమంలో ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగి లాస్య దుర్మరణం చెందింది’ అని తెలిపారు. మియాపూర్లోని దవాఖానలో చికిత్స పొందుతున్న డ్రైవర్ కమ్ పీఏ ఆకాశ్ కూడా లాస్య నందిత కుటుంబసభ్యులు చెప్పినట్టుగానే స్టేట్మెంట్ ఇచ్చాడని సమాచారం.