BRS | హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): మరాఠా గడ్డపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దూసుకుపోతున్నది. నాందేడ్, కంధార్-లోహా సభల సక్సెస్తో గులాబీ పార్టీలో జోష్ నెలకొన్నది. తొలి సభ విజయం తర్వాత భయపడ్డ మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు వెంటనే రైతులకు బడ్జెట్లో రైతుబంధు తరహా పథకాన్ని ప్రవేశపెట్టడంతోపాటు పంటల బీమా రుసుము ఎకరానికి ఒక్క రూపాయికి తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్ర ప్రజలనుంచి ఎనలేని ఆదరణ లభిస్తున్నది. గులాబీ కండువా కప్పుకొనేందుకు మహారాష్ట్ర నుంచి వివిధ పార్టీల ముఖ్య నేతలు క్యూకడుతున్నారు. తమ గడ్డపై బీఆర్ఎస్ సభ పెట్టాలని అధినేత కేసీఆర్ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఔరంగాబాద్లో లక్షన్నర మందితో మరో భారీ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. ఈ నెల 24న సభ నిర్వహణకు సమాయత్తమైంది. బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకొని, సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు సభలను మించి విజయవంతం చేసేలా ముందుకు కదులుతున్నారు.
సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా విస్తరించిన అనంతరం తొలిసారి రాష్ర్టానికి వెలుపల మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న భారీ సమావేశాన్ని నిర్వహించారు. భారీగా ప్రజలు తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. ఆ సభ అనంతరం కేవలం 55 రోజుల వ్యవధిలోనే కంధార్ నియోజకవర్గం లోహా పట్టణంలో మార్చి 26న రెండో సభను నిర్వహించారు. ఈ సభకు నాందేడ్ సభకు మించి రెట్టింపు సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మరఠ్వాడ, విదర్భ రీజియన్ల పల్లెలనుంచి జనం సద్దులు కట్టుకొని మరీ సభకు వచ్చారు. యువకులు, స్థానికులు, వ్యాపారులతోపాటు దాదాపు అన్నివర్గాల వారు కలుపుకొని 70 వేల మందికిపైగా జనం హాజరయ్యారు.
లోహా పట్టణ కేంద్రంలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బైల్ బజార్లో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తొలి రెండు సభలు దిగ్విజయం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు మరో భారీ సభకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ సారి లక్షన్నర మందితో ఔరంగాబాద్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. తొలి రెండు సభలు తెలంగాణ సరిహద్దులకు సమీపం కాగా, తాజా సభ మహారాష్ట్ర నడిబొడ్డయిన ఔరంగబాద్లో నిర్వహించాలని తలపెట్టడం బీఆర్ఎస్ ఆత్మవిశ్వాసానికి, మరాఠా ప్రజల ఆదరణకు అద్దంపడుతున్నది.
కేసీఆర్కు బ్రహ్మరథం
మహారాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్కు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు ఇప్పటికే దిగ్విజయంగా నిర్వహించిన తొలి రెండు సభలే ప్రబల సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ‘దేశ్కీ నేత కైసా హో.. కేసీఆర్ జైసా హో..’, ‘కేసీఆర్ తుమ్ ఆగే బఢో.. హమ్ తుమ్హారే సాథ్ హై’, ‘జయహో కేసీఆర్.. జయహో భారత రాష్ట్ర సమితి’.. అంటూ కర్షకులు, కూలీలు చేసిన నినాదాలు ఇప్పుడు యావత్ మహారాష్ట్ర అంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. సరికొత్త అభివృద్ధి నమూనాతో బీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఆకర్షిస్తున్నది. కేసీఆర్ ఆ రెండు సభల్లో వివరించిన అంశాలపై ఇప్పుడు మహారాష్ట్రలో జోరుగా చర్చ నడుస్తున్నది.
బీఆర్ఎస్కు లభిస్తున్న ఆదరణను చూసి ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, దశాబ్దాలుగా రైతుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న కిసాన్ సంఘటన నాయకులు గులాబీ కండువాలు కప్పుకొన్నారు. నాందేడ్, పర్భణి, లాతూర్, జలగావ్తోపాటు మరాఠ్వాడ రీజియన్లో ఎన్సీపీ, శివసేన పార్టీలు బీఆర్ఎస్ ధాటికి కుదేలయ్యాయి. ఇటీవలే నాసిక్కు చెందిన పలువురు సిట్టింగ్ కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వారితోపాటు అనేక మంది ప్రజాప్రతినిధులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ గులాబీ కండువాలు కప్పుకొంటున్నారు. బీఆర్ఎస్తోనే మార్పు సాధ్యమని ప్రబలంగా విశ్వసిస్తున్నారు.
కన్నాడ్లో సన్నాహక సమావేశం
ఔరంగాబాద్లో ఈ నెల 24న నిర్వహించ తలపెట్టిన సభకు బీఆర్ఎస్ ఏర్పాట్లు ప్రారంభించింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఔరంగాబాద్ చేరుకొన్నారు. కన్నాడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కిసాన్ సెల్ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం ఆధ్వర్యంలో శనివారం భారీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఈ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్ బీఆర్ఎస్లో చేరడం విశేషం.
ఆయన నేతృత్వంలో సన్నాహక సమావేశంలో దాదాపు 200 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కిసాన్సెల్ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్రావు కదం, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యే, రైతు నాయకుడు శంకరన్న దోండ్గే, ఆదిత్యజాదవ్, అంకిత్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.