వనపర్తి,మార్చి 15(నమస్తే తెలంగాణ) : అధికారులు ప్రజల పక్షాన ఉండాలి.. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి తానా అంటే తందానా అనే రీతిలో వంతపాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. నాయకుల సంతోషం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టే సంస్కృతిని అమలు చేస్తున్న పోలీసు అధికారులు పునరాలోచించుకోవాలని సూచించారు.
ఆదివారం వనపర్తిలోని తన నివాసంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలుచేయని పథకాలపై ప్రశ్నించినా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. రైతులకు కరెంటు, యూరియా సరఫరా సక్రమంగా లేనందున నష్టాలపాలవుతున్నారని, రైతు భరోసా ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.
చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్రెడ్డి హత్య కేసును రెండున్నరేళ్లుగా ఛేదించక పోవడం విచారకరమని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. హత్య కేసును ఎందుకు విచారణ పేరుతో పెండింగ్ పెట్టారని ప్రశ్నించారు. పోలీసు శాఖలో చిత్తశుద్ధితో పనిచేసే అధికారులకు ఇలాంటి చర్యలు తలవంపులు తెస్తున్నాయని చెప్పారు.
వారం రోజుల్లో శ్రీధర్రెడ్డి హత్యకేసును ఛేదించని పక్షంలో మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెడికల్ కళాశాలకు కేటాయించిన స్థలంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం చేపట్టవద్దని, గతంలో మంజూరైన బైపాస్ రోడ్డును పునరుద్ధరించాలని సీఎం రేవంత్రెడ్డికి వేర్వేరుగా లేఖలు పంపుతున్నట్టు తెలిపారు.