భద్రాచలం, మే 23: ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో చోటుచేసుకున్నది. కొణిజర్ల మండలం సిద్ధిక్నగర్కు చెందిన పగిడిపల్లి కారుణ్య (17) కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నది. గురువారం తెల్లవారుజామున 3:40 గంటలకు ఓ విద్యార్థిని బాత్రూం వెళ్లేందుకు బయటకు రాగా కారుణ్య కళాశాల ఆవరణలో రక్తపుగాయాలతో పడి ఉన్న విషయాన్ని గమనించి తోటి విద్యార్థినులతో కలిసి హాస్టల్ వార్డెన్కు తెలిపింది.
వెంటనే 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి 8.30 గంటలకు మృతి చెందినట్టు ఎస్సై విజయలక్ష్మి తెలిపారు. దవాఖాన వద్ద కారుణ్య తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగగా గిరిజన, దళితసంఘాల నాయకులు మద్దతు పలికారు. భద్రాచలం ఏఎస్పీ దవాఖాన వద్దకు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా కారుణ్య కళాశాల భవనంపైకి వెళ్లినట్టు సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డు కావడంతో ఎందుకు వెళ్లి ఉంటుందోనని పోలీసులు అనుమానిస్తున్నారు. పైఅంతస్తు నుంచి తానే దూకిందా? లేక ఎవరైనా తోసివేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.