యాదాద్రి, నవంబర్ 22: కరువునేలకు గోదావరి జలాలు అందించాలన్న సంకల్పంతో చేపడుతున్న నృసింహసాగర్ (బస్వాపూర్) దిగువ ప్రధాన కాల్వ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొత్తం 49.900 కిలోమీటర్ల వరకు ప్రవహించే ప్రధాన దిగువ కాల్వ తవ్వకం, కట్టడాల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీలు, రెగ్యులేటర్లు, మైనర్లు, సబ్ మైనర్ల తవ్వకం పనులు జరుగుతున్నాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,442 కోట్ల నిధులను కేటాయించగా, రూ. 630 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే 54 శాతం పనులు పూర్తికాగా, 46 శాతం పనులు పురోగతిలో ఉన్నాయి. కాళేశ్వరం 15వ ప్యాకేజీలో భాగంగా నిర్మితమవుతున్న కాల్వ నిర్మాణం కోసం మంచిరోనిమామిడ్ల గ్రామ శివారులో గుట్ట నేరుగా సొరంగాన్ని తొవ్వారు. 1.25 కిలోమీటర్లు పొడవు, 5.0 డయామీటర్ వెడల్పుతో ఈ సొరంగం తొవ్వారు. ఒకేసారి నీటి ప్రవాహం తట్టుకొనే విధంగా పటిష్ఠ చర్యలు చేపట్టారు. నృసింహసాగర్ జలాశయానికి నీళ్లు వచ్చి చేరాయి.
ఈ జలాశయం కింద మొత్తం యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలో మొత్తం 1,65,500 ఎకరాల ఆయకట్టు సాగుకు వచ్చేలా పనులు సాగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నృసింహసాగర్ జలాశయం సామర్థ్యం 0.8 టీఎంసీలు మాత్రమే ఉండేది. సీఎం కేసీఆర్ నృసింహసాగర్ జలాశయం సామర్థ్యాన్ని 11.39 టీఎంసీ వరకు పెంచగా, ప్రస్తుతం 0.4 టీఎంసీ నీటిని నిల్వ చేసుకొనేందుకు వీలుగా పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది మార్చి 26న గోదావరి జలాలతో నృసింహస్వామి జలాశయాన్ని నింపారు. నీటి నిల్వతో యాదాద్రిభువనగిరి జిల్లాతోపాటు నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయి. ఆలేరు నియోజకవర్గానికి నీళ్లందించే ఓటీ-2 బ్రాంచ్ కెనాల్ పనులు పురోగతిలో ఉన్నాయి.