కర్ణాటకలోనూ తెలంగాణ రాష్ట్ర తరహా వ్యవసాయ పథకాలు అమలు చేయించాలి
సంజయ్, అరుణకు రాయచూర్ రైతుల వినతి
కన్నడ సీఎంతో అమలు చేయించాలని విజ్ఞప్తి
వినతిపత్రం చదివి బిక్కమొఖం వేసిన సంజయ్
సమాధానం చెప్పకుండా పారిపోయిన బండి
సొంతగడ్డలో డీకే అరుణకు చేదు అనుభవం
మహబూబ్నగర్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అది జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం.. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర గురువారం మధ్యాహ్నం గద్వాలకు చేరుకొన్నది.. ఆ పార్టీ శ్రేణులు అక్కడ బహిరంగసభ ఏర్పాటు చేశారు. సభకు హాజరైన సంజయ్.. అక్కడికి వచ్చిన రైతుల నుంచి వినతిపత్రాలు తీసుకొంటున్నారు. ఇదే క్రమంలో కొందరు రైతులు ఇచ్చిన వినతిపత్రం అందుకొని చదివిన బండికి దిమ్మ తిరిగిపోయింది. ఒక్కసారిగా బిక్కమొఖం వేశాడు. వారికి సమాధానం చెప్పలేక తప్పించుకొని వెళ్లిపోయాడు. ఆ వినతిపత్రం ఇచ్చింది తెలంగాణ రైతులు కాదు. పొరుగున ఉన్న కర్ణాటకలోని రాయచూర్ రైతులు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మా రాష్ట్రంలోనూ అమలయ్యేలా చూడాలని సంజయ్కి వినతిపత్రం అందజేశారు.
రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, దళితబంధు వంటి పథకాలు మాకూ అందించేలా కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశా రు. ఈ ఘటనతో బండి సంజయ్తో పాటు, సొంతగడ్డలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, కర్ణాటక రాష్ట్ర బీజేపీ వ్యవహరాల ఇన్చార్జి డీకే అరుణ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. రైతులు మాట్లాడుతూ, కర్ణాటకలో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలుకాక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయం దండగ అనే స్థాయి నుంచి పండుగలా మారిందని, అలాంటి పరిస్థితి కర్ణాటకలోనూ రావాలని కోరారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతున్నదని చెప్తున్న తరుణంలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కర్ణాటకలోనూ అమలు చేయాలని కోరారు. బండి సభలో కర్ణాటక రైతుల వినతిపత్రం వ్యవహారం సంచలనం సృష్టించింది. పొరుగున ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రం రైతులు వచ్చి, తమ రాష్ట్రంలో కనీస సంక్షేమ పథకాలు అమలుచేయలేని పరిస్థితుల్లో తమ ప్రభుత్వం ఉన్నదని పేర్కొనడం ఆ పార్టీ అసమర్థతను వేలెత్తిచూపింది.
బండి బహిరంగ సభ వెలవెల.. ప్రజల్లేని ప్రజా సంగ్రామ యాత్ర
బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వెలవెలబోయింది. డీకే అరుణ సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభ విఫలమైంది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి, ఎమ్మెల్యే ఈటల సహా పలువురు పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. గద్వాల నడిబొడ్డున తేరు మైదానంలో వేసిన సగానికి పైగా కుర్చీలు ఖాళీగానే దర్శనమిచ్చాయి. బండి సంజయ్ మాట్లాడే సమయానికి చాలా మంది తిరిగి వెళ్లిపోయారు. ఉసూరుమంటూనే నాయకులు ప్రసంగాలు మొదలుపెట్టారు. దాంతో ఉన్నవాళ్లు కూడా అక్కడి నుంచి జారుకోవడం మొదలుపెట్టారు. స్థానిక నేత డీకే అరుణ ప్రసంగం మొదలుపెట్టే సమయానికి సభ దాదాపు ఖాళీ అయ్యింది. దీంతో ఆమె మమ అంటూ ప్రసంగం అయ్యిందనిపించారు. సభ సక్సెక్ కోసం డీకే అరుణ, బీజేపీ శ్రేణులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఈ పరిణామంతో బీజేపీపై ప్రజల్లో ఉన్న నమ్మకం తేలిపోయింది. సభ విఫలంపై బీజేపీలోనూ చర్చమొదలైనట్టు తెలిసింది.
సారాంశం: ఏ పార్టీ బలం ఎంత అన్నది సోషల్మీడియా అబద్ధాల్లో కాదు, ప్రజా క్షేత్రంలో మాత్రమే తెలుస్తుంది.