హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): లైంగికదాడి ఆరోపణలతో సస్పెండైన ట్రైనీ ఐపీఎస్ ఎం ఉదయ్కృష్ణారెడ్డికి మంగళవారం వరకు పొటెన్సీ పరీక్ష నిర్వహించబోమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు హామీ ఇచ్చారు. పొటెన్సీ పరీక్షను నిర్వహించడానికి రాజేంద్రనగర్ కోర్టు అనుమతించడాన్ని సవాలు చేస్తూ ఉదయ్కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జే శ్రీనివాసరావు విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది జీ అశోక్రెడ్డి వాదనలు వినిపిస్తూ కింది కోర్టు ఉత్తర్వులు చట్టవిరుద్ధమని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ దర్యాప్తులో భాగంగానే పరీక్షలు ఉంటాయని చెప్పారు. దర్యాప్తు అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై కింది కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుందని చెప్పారు. ఒకవేళ కోర్టు ఆదేశించినా మంగళవారం వరకు ఎలాంటి పరీక్షలు నిర్వహించబోమని హామీ ఇవ్వడంతో న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.