హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Minister Nirmala) పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్(Budget) నిరాశజనకంగా ఉందని బీఆర్ఎస్ ఎంపీలు (BRS MPs) కే. కేశవరావు(Kesava Rao), నామా నాగేశ్వరరావు(Nama Nageshwar Rao) అన్నారు. బడ్జెట్ ప్రసంగం మొత్తం కూడా సొంత డబ్బాలాగా ఉందని, అదిచేశాం. ఇది చేశామంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఎప్పటిలాగే తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపారని, విభజన హామీల అమలు, హక్కుగా రావాల్సిన నిధుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని ఆరోపించారు. మొత్తంగా ఎన్నికల వేళ ప్రచారం చేసుకునేందుకు బడ్జెట్ ప్రసంగాన్ని వాడుకున్నారని, దేశ ప్రజల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా కల్పించలేకపోయిందని పేర్కొన్నారు.
అది రాజకీయ ప్రసంగం..
మంత్రి ప్రసంగం రాజకీయ ప్రసంగాన్ని తలపించిందని విమర్శించారు. బడ్జెట్ ఏ వర్గాన్ని సంతృప్త పరచ లేకపోయిందని అన్నారు. ఒక్క కొత్త సంక్షేమ పథకం బడ్జెట్లో ప్రస్తవించలేదని దుయ్యబట్టారు. దేశంలో ద్రవ్యోల్బనం, నిరుద్యోగం నిర్మూలన దిశగా ఎలాంటి ప్రస్తావన లేదని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచే ప్రణాళిక లేదని వెల్లడించారు. రైతులు, వ్యవసాయానికి ఉపయోగపడే విషయాలు లేకపోవడం విచారకరమని వారు అన్నారు.
మధ్యంతర బడ్జెట్లో సామాన్యులకు, ఉద్యోగులకు ఎలాంటి ఊరట కలిగించే అంశాలు లేవని తెలిపారు. గత పది సంవత్సరాల్లో కేంద్రానికి ప్రత్యక్ష పన్నులు మూడింతలు రాగా వచ్చిన రాబడిని పేదల సంక్షేమం కోసం ఖర్చు చేసేందుకు మోదీ ప్రభుత్వం సుముఖంగా లేదని పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం ప్రారంభించిన పీఎం కిసాన్ (PM Kisan Scheme) సాయం రూ. 6వేలు పెంచలేకపోయిందని ఆరోపించారు.
రైతులకు మొండిచేయి..
రైతుల ఆదాయాన్ని రెట్టింపును బడ్జెట్లో లేదని అన్నారు. వ్యవసాయరంగానికి తక్కువ కేటాయింపులు చేసి రైతులకు మొండిచేయి చూపారని తెలిపారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించే ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షల అంశాన్ని మరిచిపోయారని అన్నారు. అయూష్మాన్ భారత్ పథకం కింద అందించే కవరేజ్ రూ. 10 లక్షలకు పెంచుతారని ఎదురు చూసిన పేదలకు నిరాశే ఎదురయ్యిందని పేర్కొన్నారు.