ఖిల్లాఘణపురం, జూన్ 16: క్రీడాకారుల్లో ప్రతిభ ఉన్నా క్రీడా ప్రాంగణాలు లేక వెనుకడుగు వేస్తున్నారనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి గ్రామానికి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ క్రీడా మైదానాలు కొత్త తరాలకు ప్రోత్సహించేలా రూపుదిద్దుకుంటాయని తెలిపారు. గురువారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని కర్నెతండాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని కలెక్టర్ షేక్యాస్మిన్ బాషా, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలతో చురుకుదనంతోపాటు చదువుపై ఆసక్తి పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో వనపర్తి నియోజక వర్గంలోనే ఎక్కువ క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం క్రీడా మైదానంలో పోటీలు ప్రారంభించి కొద్దిసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కర్నెతండా సమీపంలో కొనసాగుతున్న కర్నెతండా ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు.