హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన బాలుడిని చాకచాక్యంగా కాపాడాడో యువకుడు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గుండుగోలనుగుంటకు చెందిన బాలుడు జశ్వంత్ ప్రమాదవశాత్తు 400 అడుగుల లోతు ఉన్న పూడిపోయిన బోరుబావిలో పడిపోయాడు. అతడు 30 అడుగుల లోతులో రాయిపై చిక్కుకొన్నాడు. బాలుడు కనిపించకపోవటంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. బోరు బావి వైపు వెళ్లి చూశారు. అందులోంచి జశ్వంత్ కేకలు వేయటాన్ని గమనించారు. వెంటనే సురేశ్ అనే యువకుడు.. తన నడుముకు తాడు కట్టుకొని బోరు బావిలోకి దిగాడు. లోపలికి వెళ్లి జశ్వంత్కు తాడు కట్టడంతో స్థానికులు వాళ్లను పైకి లాగారు. సుమారు 5 గంటలపైనే బోరు బావిలో ఉన్న జశ్వంత్.. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. సురేశ్ రియల్ హీరో అంటూ స్థానికులు అభినందించారు.