హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్17 (నమస్తే తెలంగాణ): నేటి పోటీప్రపంచం విద్యావిధానం స్వరూపాన్నే మార్చివేస్తున్నది. విద్యార్థులు సంప్రదాయ డిగ్రీ కోర్సులను వదిలి తక్షణం ఉపాధి కల్పించే కోర్సులవైపు ఆకర్షితులవుతున్నారు. అలాంటి కోర్సులను హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అగ్రికల్చర్, మెడికల్, మేనేజ్మెంట్, ఇంజినీరింగ్ విభాగాల్లో విభిన్న ప్రోగ్రామ్స్ను ఈ ఏడాది నుంచి ప్రవేశపెడుతున్నది. పారామెడికల్ విభాగంలో 12 వరకు కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2021-22 ఏడాదికి ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలచేసింది.
విభిన్నమైన కోర్సులు..
బీఎస్సీ అనస్థీషియా, ఆపరేషన్ థియెటర్ టెక్నాలజీ, కార్డియో వాస్క్యులర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ, డెంటల్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఆప్టిమెట్రీ, హెల్త్ సైకాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీతోపాటు డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్, వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫిజియోథెరపీ, ఫిషరీస్, బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆనర్స్. ఎంఎస్సీలో జెనిటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనామీ, ఎంటమాలజీ, ప్లాంట్ పాథాలజీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, హార్టికల్చర్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
ఇంజినీరింగ్ విభాగంలో..
ఇంజినీరింగ్ విభాగంలో ఆధునాత కోర్సులను మల్లారెడ్డి యూనివర్సిటీ అందుబాటులోకి తీసుకొచ్చింది. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొగ్రామ్లను ప్రవేశపెట్టింది. ఎంటెక్లో క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, వీఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్స్ తదితర కోర్సులను తీసుకొచ్చింది.నూతన విద్యా విధానం 2020 ప్రకారం సాధారణ డిగ్రీ, మేనేజ్మెంట్ కోర్సుల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. బీకామ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అండ్ అకౌంటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ ప్రమోషన్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అండ్ జీఎస్టీ, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులు అందులో కొన్ని. వీటిలో కొన్ని మూడేండ్ల కాలవ్యవధి ఉండగా, మరికొన్నింటికి నాలుగేండ్ల కాలవ్యవధి కోర్సులు. బీబీఏ వంటి మేనేజ్మెంట్ కోర్సుల్లోనూ లాజిస్టిక్స్, అగ్రి బిజినెస్, ఏవియేషన్ అండ్ టూరిజం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వంటి ప్రత్యేక కోర్సులను ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టింది. సివిల్స్, ఇతర పోటీపరీక్షలకు ముందునుంచే ఉపయోగపడేలా రెండు డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టడం విశేషం. ఇంజినీరింగ్, అగ్రి కోర్సుల్లో యూనివర్సిటీలో 480 సీట్ల చొప్పున ఉండగా, ఇతర ప్రోగ్రామ్లలో 120 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి.
అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల
కొవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఉచిత విద్యను అందించనున్నట్టు మల్లారెడ్డి యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ డీఎన్ రెడ్డి తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ను యూనివర్సిటీ డైరెక్టర్లు, విభాగాధిపతులతో కలిసి గురువారం విడుదలచేశారు. ఈ సందర్భంగా డీఎన్ రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా విద్యార్థులు సత్వరం ఉపాధి పొందగల 70కిపైగా కొత్త కోర్సులను యూనివర్సిటీ ఈ ఏడాది ప్రవేశపెడుతున్నదని వివరించారు. పారామెడికల్, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ రంగాల్లోని అవకాశాలను యువత అందిపుచ్చుకొనేలా ప్రోగ్రామ్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. కొవిడ్ కారణంగా తల్లిని కానీ, తండ్రిని కానీ కోల్పోయి, ఇంటర్లో 70శాతానికి పైగా మార్కులను సాధించిన విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.75వేల నుంచి రూ.1లక్ష వరకు మెరిట్ స్కాలర్షిప్లను అందిస్తామని చెప్పారు. సమావేశంలో వైస్చాన్సలర్ వీఎస్కే రెడ్డి, యూనివర్సిటీ డైరెక్టర్లు మహేందర్రెడ్డి, షాలిని, డాక్టర్ భద్రారెడ్డి, డాక్టర్ ప్రీతి, డీన్లు ఏ రాజిరెడ్డి, లక్ష్మయ్య, కే ఏ ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు.