వనపర్తి: వనపర్తి జిల్లాలో కొత్త రెవెన్యూ మండలం ఏర్పాటుకాబోతున్నది. పరిసర మూడు మండలాల్లోని కొన్ని గ్రామాలతో కలిపి ఏదుల గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయనున్నారు. ఇవాళ ప్రభుత్వం అందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ పేరుతో విడుదలైన ఈ నోటిఫికేషన్లో.. 1974 నాటి జిల్లా ఫార్మేషన్ చట్టంలోని సెక్షన్-3లోగల సబ్సెక్షన్ 5 కింద నూతన రెవెన్యూ మండలం ఏర్పాటు ప్రక్రియను చేపట్టినట్టు పేర్కొన్నారు.
ఈ మండల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా, ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సలహాలు, సూచనలు, అభ్యంతరాలను గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 15 రోజుల్లోగా అందజేయాలని పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలోని రేవళ్లి మండలం నుంచి చెన్నారం, చీరకపల్లి గ్రామాలను, గోపాల్పేట మండలంలోని ఏదుల గ్రామాన్ని, నాగర్కర్నూల్ జిల్లా కోడేర్ మండలంలోని సింగాయిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకులపల్లి గ్రామాలను కలిపి నూతన మండలంగా ఏర్పాటు చేస్తున్నారు.
పైన పేర్కొన్న జిల్లాలు, మండలాలు, గ్రామాల పౌరులు తమ అభ్యంతరాలను గానీ, సలహాలు, సూచనలను గానీ 15 రోజుల్లో సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేయాలని సూచించారు. కాగా, కొత్త రెవెన్యూ మండలంగా ఏర్పాటు కాబోతున్న ఏదుల గ్రామం ప్రస్తుతం వనపర్తి జిల్లాలోని వనపర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో గోపాల్పేట్ మండలంలో ఉన్నది.