హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): సంప్రదాయ వృత్తులు, ఇతర కళా రంగాల్లో నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. కళాకారులకు తర్ఫీదునివ్వడం, వారిని ప్రోత్సహించడంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. భారతీయ సంస్కృతి, వారసత్వంపై 46 రంగాల్లో ఈ కోర్సులను ప్రవేశపెట్టేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విదేశీ విద్యార్థులు సైతం ఈ కోర్సులను తీసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు ‘గైడ్లైన్స్ ఫర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ కోర్సెస్ బేస్డ్ ఆన్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్’ పేరుతో యూజీసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనిపై ఈ నెల 31 వరకు సూచనలు, సలహాలివ్వవచ్చని పేర్కొన్నది.
ఎవరికి ఉపయోగం?
ఎలాంటి కోర్సులంటే..?
భారతీయ పురాణగాథలు, జ్యోతిషం, వేద గణితం, యోగా, ఆయుర్వేదం, సంస్కృతం, తెలుగు సహా పలు భారతీయ భాషలు, శిల్పం, సంగీతం, నృత్యం, డ్రామా, విజువల్ ఆర్ట్స్, హస్తకళలు, ఆచారాలు, పురావస్తు ప్రదేశాలు, స్మాకర చిహ్నాలు, మానవ విలువలు వంటి 46 రంగాల్లో ఈ కోర్సులు చేయవచ్చు.
మూడు స్థాయిల్లో నిర్వహణ
ఈ కోర్సులను మూడు స్థాయిల్లో నిర్వహించవచ్చునని యూజీసీ ప్రకటించింది. పరిచయ స్థాయి (ఇంట్రడక్టరీ లెవల్), ఇంటర్మీడియట్, హైయ్యర్ లెవల్స్లో కోర్సులను నిర్వహిస్తారు. ప్రతి ప్రోగ్రాంను 60 గంటల పాటు బోధిస్తారు. తరగతులు ఆన్లైన్, ఆఫ్లైన్లో నిర్వహించవచ్చు. అంతర్గత మూల్యాంకనంలో భాగంగా విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్, పేపర్ ప్రజంటేషన్, వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎవాల్యూషన్, వైవా -వాయిస్, ఇతర పద్ధతుల్లో సైతం మూల్యాంకనం చేస్తారు. సాధించిన క్రెడిట్స్ను అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ (ఏబీసీ)లో నమోదు చేస్తారు.