హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): మూస విద్యావిధానానికి స్వస్తిపలికేందుకు ఉన్నత విద్యామండలి నడుం బిగించింది. వచ్చే ఏడాదికల్లా కొలువులిచ్చే కోర్సుల రూపకల్పనకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ముగ్గురు వైస్చాన్స్లర్లతో త్రిసభ్య కమిటీని నియమించింది. శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ మల్లేశ్ చైర్మన్గా, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్, మహత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి సభ్యులుగా కమిటీ వేసింది. శనివారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అధ్యక్షతన నిర్వహించిన వైస్చాన్స్లర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఉపాధి అవకాశాలిచ్చే ఎమర్జింగ్ కోర్సులను ప్రవేశపెట్టడంతోపాటు క్రెడిట్స్, గ్రేడింగ్ విధానంపైనా కమిటీ అధ్యయనం చేయనున్నది. ప్రస్తుతానికి మన దగ్గర డిగ్రీలో 501 కాంబినేషన్ల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 4 లక్షలకు పైగా సీట్లుంటే ఏటా 1.5 లక్షల విద్యార్థులు మాత్రమే డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. వీరంతా డిగ్రీ తర్వాత నైపుణ్య లేమితో ఖాళీగా ఉంటున్నారు. కోర్సులు, కరిక్యులాన్ని సమగ్రంగా మార్చడం ద్వారా ఈ పరిస్థితికి చెక్పెట్టవచ్చని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు.
వర్సిటీల్లో డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణకు కమిటీలు
సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి – సైబర్ నేరాల నుంచి విద్యార్థులను కాపాడేందుకు డ్రగ్స్ నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వర్సిటీ స్థాయిలోనే అవగాహన కల్పించేందుకు కమిటీని వేయనున్నారు. లీగల్ సెల్, పోలీసులు, స్వచ్ఛంద సంస్థ లు, వర్సిటీ అధికారులు, విద్యార్థి సంఘాల నేతలతో ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. యూజీసీ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం సైబర్ నేరాలు, డ్రగ్స్ నిరోధించేందుకు వర్సిటీ స్థాయిలో రెండు క్రెడిట్స్ను ప్రవేశపెట్టినట్టు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు.