హైదరాబాద్/చార్మినార్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కును సీఎం కేసీఆర్ సహకారంతో అంతర్జాతీయ స్థాయి జంతు ప్రదర్శనశాలగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. నెహ్రూ జూపార్క్ 60 వసంతాలను పూర్తిచేసుకోవడంతో శుక్రవారం నిర్వహించిన శుక్రవారం నిర్వహించిన వజ్రోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపార్క్ ఎంట్రీ వద్ద ఏర్పాటు చేసిన వజ్రోత్సవాల లోగో, డైమండ్ జూబ్లీ పైలాన్, సెంట్రల్ ఫౌంటెయిన్ను ఆవిష్కరించడంతోపాటు ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ టికెట్ సేవలను ప్రారంభించారు.
సందర్శకుల వీక్షణ కోసం 30 ఏండ్ల తర్వాత మళ్లీ 2 కపుచిన్ జాతి కోతులను, 2 తెల్ల పులులను జూలో ప్రవేశపెట్టడంతోపాటు ఈ-సైకిల్, ఎలక్ట్రిక్ రోడ్రైలు సేవలను ప్రారంభించారు. ఆ రెండు తెల్ల పులులకు శివపార్వతులుగా నామకణం చేసి, ఈ-సైకిల్పై షికారు చేశారు. డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఉత్తమ సేవలు అందిస్తున్న జూపార్క్ సిబ్బందిని, జూ నిర్వహణకు చేయూతనిస్తున్న సంస్థల ప్రతినిధులను సత్కరించారు. కార్యక్రమంలో బహదూర్పుర ఎమ్మెల్యే మౌజంఖాన్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ తదితరులు పాల్గొన్నారు.