Telangana | హైదరాబాద్/కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ‘స్వచ్ఛ’ అవార్డుల్లో ఈ ఏడాది కూడా జాతీయస్థాయిలో తెలంగాణ హవా కొనసాగింది. నిరుడు నవంబర్ వరకు చేపట్టిన కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా అవార్డులను ప్రకటించగా, స్వచ్ఛ భారత్ పట్టణ విభాగంలో రాష్ర్టానికి నాలుగు పురస్కారాలు దక్కాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయస్థాయిలో అవార్డు దక్కించుకొని ఘనతను చాటింది. సిద్దిపేట, గుండ్లపోచంపల్లి, నిజాంపేట పట్టణాలు దక్షిణ భారతదేశ విభాగంలో అవార్డులను దక్కించుకొన్నాయి. ఈ అవార్డులను ఈ నెల 11న ఢిల్లీ ప్రగతి మైదాన్లో కేంద్రం అందించనున్నది. గత కేసీఆర్ సర్కారు మున్సిపాలిటీల్లో పారిశుధ్య, పచ్చదనం, తాగునీటి సరఫరా, ఇతర కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, చెత్త సేకరణ వాహనాలు, పారిశుధ్య కార్మికుల నియామకం, ఇంటింటా చెత్త సేకరణ, మరుగుదొడ్ల నిర్మాణం, ఎఫ్ఎస్టీపీలు, వైకుంఠధామాలు, సమీకృత మార్కెట్ల నిర్మాణం, హరితహారం తదితర కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. ఈ కార్యక్రమాల ద్వారా జాతీయస్థాయిలో తెలంగాణ పట్టణాలకు అనేక అవార్డులు దక్కాయి.
స్వచ్ఛ సర్వేక్షణ్లో సిద్దిపేట టాప్..: హరీశ్రావు హర్షం
స్వచ్ఛ సర్వేక్షణ్లో దక్షిణ భారతదేశ విభాగంలో సిద్దిపేట అగ్రస్థానంలో నిలువడంపై మాజీ మంత్రి, శాసన సభ్యుడు హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణల్లో సిద్దిపేట చేపట్టిన వినూత్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. సిద్దిపేటకు మరోసారి అవార్డు రావడం గర్వకారణమని చెప్పారు. సహకారం అందించిన ప్రజలు, కృషి చేసిన కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
కరీంనగర్కు వాటర్ ప్లస్ హోదా
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ప్రకటించిన వాటర్ ప్లస్లో కరీంనగర్ నగరపాలక సంస్థకు స్థానం దక్కింది. దేశవ్యాప్తంగా 15 నగరాలకు మాత్రమే వాటర్ ప్లస్ స్థాయిని కేంద్రం కల్పించగా.. అందులో హైదరాబాద్తోపాటు కరీంనగర్ ఉన్నది. దేశంలో వాటర్ స్టేటస్ ఎనిమిది నగరాలకు మాత్రమే ఇవ్వగా, తెలంగాణలో ఒక్క కరీంనగర్కు మాత్రమే దక్కింది. నగరపాలక సంస్థ పరిధిలో ఇటీవల చేపట్టిన విస్తృత కార్యక్రమాలతో వాటర్ ప్లస్ హోదాకు కరీంనగర్ ఎంపికైంది.