జమ్మికుంట, డిసెంబర్ 5: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గోపాల్రావుపేటకు చెందిన ఆదర్శ రైతు ద్యావ రామచంద్రారెడ్డిని జాతీయ ఉత్తమ మిలియనీర్ రైతు అవార్డు వరించింది. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, కృషి జాగరణ్ సంయుక్తంగా ఏటా ‘మిలీనియం ఫార్మర్స్ మీట్’లో ఉత్తమ రైతులకు అవార్డులను అందజేస్తుంది. అందు లో భాగంగానే ‘మిలీనియం ఫార్మర్స్ మీట్-2023’ ఢిల్లీలో ఈ నెల 5 నుంచి 3 రోజులపాటు జరుగుతుంది. తెలంగాణ నుంచి నలుగురు రైతులు ఎంపికయ్యారు. అందులో జమ్మికుంట కేవీకే ఫార్మర్ ఆర్సీ రెడ్డి కూడా ఉన్నారు. రామచంద్రారెడ్డి 25 ఏండ్ల నుంచి వ్యవసా యం చేస్తున్నారు. సాగులో సరికొత్త మార్పులను ఆచరించి ముందుకు సాగుతున్నారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం, ఉద్యాన శాస్త్రవేత్త వేణుగోపాల్ ప్రోత్సాహంతో బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, మస్క్ మిలన్, లిచ్చి, ఊష్ణ ఆపిల్, వరి తదితర పంటలు సాగు చేస్తున్నారు. పంట దిగుబడులను ‘ఆర్సీ రెడ్డి’ బ్రాండు తో విక్రయిస్తున్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, కృషి జాగరణ్ సంస్థలు ఆయనను జాతీయ ఉత్తమ రైతు అవార్డుకు ఎంపిక చేశాయి. ఈ నెల 8న ఆర్సీ రెడ్డి జాతీయ ఉత్తమ మిలియనీర్ రైతు అవార్డు అందుకోనున్నారు.