ములుగు, హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ)/నవాబ్పేట: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా తెలంగాణ నుంచి ముగ్గురు టీచర్లు ఎంపికయ్యారు. మహబూబ్నగర్ జిల్లా పరిషత్తు హైస్కూల్ ఉపాధ్యాయుడు టీఎన్ శ్రీధర్, ములుగు జిల్లా అబ్బాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు కందాల రామయ్య, నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీతారావుకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు దక్కాయి. గురువారం కేంద్రం ప్రకటించిన జాబితాలో దేశవ్యాప్తంగా 46 మందికి చోటు లభించింది. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి అవార్డులకు ఎంపికైన ముగ్గురు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. కష్టపడే ఉపాధ్యాయులను గుర్తించినందుకు ఆనందంగా ఉన్నదని టీఎన్ శ్రీధర్ తెలిపారు. కందాల రామయ్య మాట్లాడుతూ.. ‘జాతీయ అవార్డు విద్యాసేవలో నా బాధ్యతను మరింత పెంచింది. భావి భారత విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది జాతి నిర్మాణానికి పునరంకితమవుతా’ అని వెల్లడించారు. సునీతారావు మాట్లాడుతూ.. తనకు జాతీయ ఉత్తమ టీచర్ అవార్డు ప్రకటించటం సంతోషంగా ఉన్నదని వెల్లడించారు. సెప్టెంబర్ 5న ఉత్తమ టీచర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేస్తారు.