సత్తుపల్లి, ఆగస్టు 29 : రోగులకు మెరుగైన సేవలు అందించినందుకుగాను ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ అవార్డుకు ఎంపికైంది. కేంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఈనెల 9, 10వ తేదీల్లో పర్యటించిన బృందం.. పీహెచ్సీలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉండటం.. జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలను (నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్) చేరుకోవడంతో జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డుతోపాటు పీహెచ్సీకి మూడేండ్లపాటు రూ.3 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయనున్నది.