శంషాబాద్ రూరల్, మార్చి 2 : భూమికి భూమి.. ప్లాటుకు ప్లాటు ఇస్తేనే రేడియల్ రోడ్డు వేసేందుకు సహకరిస్తామని నర్కూడ గ్రామస్తులు తేల్చిచెప్పారు. శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్రెడ్డి పాల్గొని బాధితుల అభిప్రాయం తెలుసుకున్నారు. అవసరంలేని చోట రేడియల్ రోడ్డు నిర్మిస్తున్నారని, పాత రోడ్డునే వెడల్పు చేయాలని కోరారు. సర్పంచ్ శేఖర్యాదవ్ మాట్లాడుతూ అమ్మనపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్19లో బాధితులకు భూమి కేటాయించాలని కోరగా, పలువురు అడ్డు తగిలారు. ఆభూములపై కేసులు ఉన్నాయని ఎలాంటి ఇబ్బందులు లేని చోట భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీనిపై అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని, భూమి మాత్రం ఇవ్వబోమని స్పష్టం చేశారు. రేడియల్ రోడ్డుకు కచ్చితంగా భూములు తీసుకుంటామని స్పష్టం చేయడంతో గ్రామసభ గందరగోళంగా మారింది. దీంతో అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి సభ నుంచి వెళ్లేపోయేందుకు ప్రయత్నించారు. ఆయన కారుకు అడ్డుగా బాధితులు బైఠాయించారు. సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. దీనిపై అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో మాట్లాడుతూ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని నివేదిస్తామని, న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు.
రేడియల్ రోడ్డు అలైన్మెంట్లో మూడు కుంటలు పోతున్నాయని, సుమారు వంద కుటుంబాలు వీటిపై ఆధారపడి ఉన్నాయని రాష్ట్ర మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు జీ నర్సింహ, జిల్లా అధ్యక్షుడు నీరటి మల్లేశ్ తెలిపారు. నర్కూడ గ్రామ పరిధిలోని ఇడిగవాని కుంట, మంగరాసికుంట, కుమ్మరివాని కుంట పూర్తిగా ధ్వంసమవుతాయని వివరించారు. మత్స్యకారులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.