హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): అమెరికాలో స్థిరపడిన రమేశ్ రాలియా నానో యూరియాను కనుగొన్నారని, భారత రైతాంగం శ్రేయస్సు కోసం నానో యూరియా టెక్నాలజీని ఇఫ్కోకు అందించారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయంలో ఎరువులు, రసాయనాల వాడకం, నానో యూరియా ఆవశ్యకతపై శుక్రవారం జరిగిన సదస్సులో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. నానో టెక్నాలజీతో తొలిసారిగా యూరియాను ద్రవరూపంలో తీసుకొచ్చారని వెల్లడించారు. దీంతో ఎరువుల సంచులను తరలించే పెద్ద ప్రక్రియను సులభతరం చేశారని తెలిపారు.
ప్రపంచ వ్యవసాయానికి నానో యూరియా ఆదర్శమన్నారు. పంటలు పండటానికి ప్రధానంగా భూమిలో పోషకాలు అవసరమని, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయని మంత్రి సింగిరెడ్డి అన్నారు. రసాయన ఎరువుల వాడకంలో గత ప్రభుత్వాలు రైతులకు సరైన పరిజ్ఞానం కల్పించకపోవడంతో ఎవరికి తోచినట్లు వారు వాడారని, దీంతో భూమిలో పోషకాలు లోపించడం, అధికం కావడం వంటివి జరిగాయని చెప్పారు. దేశంలో వినియోగించే 70 శాతం యూరియా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. అత్యధిక ఎరువులు, యూరియా వాడకం మూలంగా చెరువులు, కుంటలు, భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అనేక దుష్పరిణామాలను అరికట్టడం, రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణలో నానో యూరియాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషివల్ల సాగులో దేశంలోనే ఉన్నత స్థాయికి చేరామన్నారు.
ఎడారిగా ఉన్న ఈ ప్రాంతానికి సాగునీరు అందించి, రైతు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ రైతులను నిలువునా ముంచుతున్నారని మండిపడ్డారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో పాటు మనమంతా నిరంతర కృషి చేసి రైతుకు అండగా నిలిస్తే దేశంలోనే పంజాబ్ను సైతం వెనక్కి నెట్టివేస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మన ప్రాంతంలో వరి అధికంగా సాగు అవుతుందన్నారు. వరితో పాటు మెట్ట పంటలు సైతం పెరగాలంటే కొంత మోతాదులో యూరియా అవసరమని చెప్పారు.
దేశంలో వివిధ రాష్ర్టాలతో పాటు తెలంగాణలో కూడా యూరియాను మోతాదుకు మించి వాడుతున్నామని, ఈ నేపథ్యంలోనే రైతులను నానో యూరియా వైపు మళ్లించాలని నిర్ణయించామని మంత్రి అన్నారు. ట్రేడర్లు, వ్యాపారులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులను ఈ దిశగా మళ్లించేందుకు సహకరించాలని కోరారు. నానో యూరియా వాడకం వల్ల పంట వేగంగా ఎదుగుతుందని వెల్లడించారు. 500 మిల్లీలీటర్ల నానో యూరియా ఒక యూరియా బస్తాతో సమానమని పేర్కొన్నారు. యూరియా 30 నుంచి 50 శాతమే మొక్కకు ఉపయోగపడుతుందని, నానో యూరియా 80 శాతం వరకు పనిచేసి, మొక్క ఎదుగుదలకు తోడ్పడుతుందని మంత్రి నిరంజన్రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఇఫ్కో జీఎం డాక్టర్ జగన్మోహన్రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, వ్యవసాయశాఖ అదనపు కమిషనర్ హన్మంతు, ఆగ్రోస్ ఎండీ కే రాములు, మార్క్ఫెడ్ ఎండీ యాదిరెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకుడు జగదీశ్వర్, వ్యవసాయశాఖ అదనపు సంచాలకుడు విజయ్కుమార్, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఇలాంటి ద్రవరూప ఎరువులు సాగుకు ఎంతో అవసరం , నానో ద్రవ రూప యూరి యా వల్ల ఇన్ని లాభాలున్నాయని తెలుసుకున్నాను. ఇక నుంచి ఈ ఎరువులే వాడుతాను. యూరియా గుళికలు 50 కిలోల సంచి తీసుకువస్తే రంధ్రాలు పడి కొంత, పిచికారి చేసినప్పుడు మరికొంత వృథా అయ్యేది. యూరియా ద్రవం ప్లాస్టిక్ డబ్బాలలో దొరకడం వల్ల చాలా లాభాలున్నాయి.
– రాంరెడ్డి, రైతు, భూత్పూర్ గ్రామం, మండలం, జిల్లా మహబూబ్నగర్
పంటల సాగులో ప్రస్తుతం టెక్నాలజీకి అనుగుణంగా వచ్చిన మార్పులను మంత్రి నిరంజన్రెడ్డి చెబుతుంటే పలువురు రైతులు సెల్లో వీడియో తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి ద్వారా చాలా విషయాలు తెలుసుకొన్నట్టు వనపర్తి జిల్లా, బుద్దారం గ్రామానికి చెందిన రమేశ్ అనే రైతు చెప్పారు. తమ ఊరి రైతులకు చూపించడానికే వీడియో తీసుకున్నట్టు తెలిపారు.