బోధన్, ఫిబ్రవరి 18: ఉన్నత లక్ష్యం, నిర్దిష్ట ప్రణాళికతో విద్యార్థులు ఎదగాలని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ (బాచుపల్లి) క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్ కోటేశ్వరరావు అన్నారు. డ్యుయల్ డిగ్రీలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఉషోదయ జూనియర్ కళాశాల క్యాంపస్లో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ – కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘ఇంటర్ తర్వాత ఉన్నత విద్యావకాశాలు’ అన్న అంశంపై ‘లక్ష్యం-2024’ పేరిట అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. డీమ్డ్ యూనివర్సిటీలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను, ఆవిష్కరణల శక్తిని వెలుగులోకి తీసుకువస్తాయని అన్నారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీకి ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) గుర్తింపు లభించిందని, ఎన్ఐఆర్ఎఫ్ క్యాటగిరీ-1లో 28వ ర్యాంక్ పొందడంతో దేశంలోని అతికొద్ది గొప్ప డీమ్డ్ యూనివర్సిటీల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్, పరిశోధనలకు కేఎల్ విద్యావిధానంలో మంచి అవకాశం ఉన్నదని, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రక్రియ డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే ప్రారంభమవుతుందని, నాలుగో ఏడాదిలో ప్లేస్మెంట్ లభించి ఇంటర్న్షిప్ చేస్తూనే డిగ్రీని పూర్తిచేయవచ్చని సూచించారు. కేఎల్ యూనివర్సిటీలో నాలుగేండ్ల డిగ్రీ కోర్సులతో అమెరికా తదితర విదేశాల్లో ఉన్నత విద్యకు అవకాశాలు వస్తాయని తెలిపారు. కేఎల్ యూనివర్సిటీలో చదువుకునేందుకు ‘విద్యాలక్ష్మి’ పోర్టల్ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు పొందవచ్చని సూచించారు. సదస్సులో ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ వీ సూర్యప్రకాశ్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆనంద్రెడ్డి, ప్రసాద్, నమస్తే తెలంగాణ సీనియర్ మేనేజర్ (ప్రకటనల విభాగం) కడార్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.