హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : విదేశాల్లో విద్యను అభ్యసించడానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని వై యాక్సిస్ సొల్యూషన్స్ అసిస్టెంట్ వైస్ప్రెసిడెంట్ ఫైజల్ హసన్ అన్నారు. బుధవారం హైదరాబాద్ ఖైరతాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్(ఐఐఎంసీ)లో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దినపత్రికల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘అవేర్నెస్ ఆన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్’పై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఫైజల్ హసన్ మాట్లాడుతూ విదేశీ ఉన్నత విద్య అనేది జీవితాన్ని మార్చే నిర్ణయమని, ఇందుకు ‘వై యాక్సిస్’ ఓ మార్గదర్శకంగా నిలుస్తున్నదని తెలిపారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన 90 శాతం మంది విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనే కోరిక ఉంటున్నదని చెప్పారు.
కానీ, చాలామంది అవగాహన లేమితో దేశానికే పరిమితం అవుతున్నారని పేర్కొన్నారు. విదేశీ వర్సిటీలో చదవడానికి ఇష్టపడే విద్యార్థులు తమ ప్రిపరేషన్ ప్రక్రియను ఫాల్ అడ్మిషన్(జులై-ఆగస్టు)కు కనీసం పది నెలల ముందే ప్రారంభించాలని సూచించారు. సమాచార, సాంకేతిక నైపుణ్యాలుంటే సరిపోదని, సరైన అవగాహనతోనే విదేశీ విద్య సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే, అమెరికా తదితర దేశాలకు వెళ్లాలనుకొనే వారికి తమ సంస్థ వీసా సేవలను అందజేస్తున్నదని తెలిపారు. డాక్యుమెంటేషన్ పరిపూర్ణంగా ఉంటే తప్పకుండా కోరుకొన్న వర్సిటీలో సీటు కైవసం చేసుకోవచ్చని చెప్పారు.
సదస్సుకు విశేష స్పందన
అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. విద్యార్థులకు ప్రజెంటేషన్ ఇచ్చి అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొన్నది. సదస్సులో వైస్ ప్రిన్సిపాల్(అకడమిక్స్) డాక్టర్ డీ తిరుమలరావు, వైస్ ప్రిన్సిపాల్(అడ్మినిస్ట్రేషన్) ఎస్ సరిత, కన్వీనర్ కే పద్మప్రియ, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలి
విదేశాల్లోని వర్సిటీల్లో విద్యను ఎలా అభ్యసించాలి? వీసా ఎలా పొందాలనే అంశంపై అవగాహన కల్పించిన తీరు బాగుంది. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లినప్పుడే విదేశాల్లో ఉద్యోగం పొందవ చ్చు. వై యాక్సిస్ సొల్యూషన్స్ కన్సల్టెన్సీ చొరవ ప్రశంసనీయం. సదస్సు నిర్వహణకు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ముందుకు రావడం అభినందనీయం.
– కే రఘువీర్, ప్రిన్సిపాల్, ఐఐఎంసీ