హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తప్పు డు సమాచారాన్ని ఇస్తున్నదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా పలు బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కంపెనీలకు కేటాయించడం వాస్తవం కాదా? అని కేంద్రాన్ని నిలదీశారు. సింగరేణి గనుల్లో ఇప్పటివరకు ఎన్నింటిని ప్రైవేటు కంపెనీలకు కేటాయించారు? ఆ కేటాయింపులకు ముందు తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించారా? అని కేంద్రాన్ని లిఖి త పూర్వకంగా ప్రశ్నించారు. దీంతో సింగరేణి గనులను ప్రైవేట్ కంపెనీలకు కేటాయించలేదని బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జో షి సమాధానమిచ్చారు.
బొగ్గు గనుల చట్టం (ప్రత్యేక నిబంధనలు)- 2015 ప్రకారం గనులకు కేటాయింపుదారుని ఎంపికచేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని, ఆ అధికారం కేంద్రానికి మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బొగ్గు గనుల కేటాయింపునకు ముం దు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించడం తప్పనిసరి కాదని చెప్పారు. దీనిపై నామా ఘాటుగా స్పందించారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించడం లేదని రామగుండం సభలో చెప్పిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు పూనుకోవడంతో యావత్ తెలంగాణ సమాజమంతా ఎదురు తిరిగిన విషయం అందరికీ తెలుసని గుర్తు చేశారు.