నిడమనూరు, సెప్టెంబర్ 8 : నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు సమీపంలో బుధవారం పడిన నాగార్జునసాగర్ ఎడమ కాల్వ గండికి మరమ్మతులు ప్రారంభమయ్యాయి. 32.109వ కిలోమీటరు వద్ద అండర్ టన్నెల్లో రంధ్రం కారణంగా ఏర్పడిన లీకేజీ నేపథ్యంలో కాల్వ కట్ట కోతకు గురై గండి పడిన సంగతి తెలిసిందే. వరద నీరు పంట పొలాలు, నర్సింహులగూడెం, నిడమనూరు పట్టణంలోని లోతట్టు కాలనీలను ముంచెత్తింది. దీంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఎన్ఎస్పీ అధికారులు అప్రమత్తమై నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమ కాల్వకు నీటి విడుదలను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నానికి వరద నీరు తగ్గుముఖం పట్టింది. విద్యుత్తు, రవాణాకు అంతరాయంతోపాటు వ్యవసాయ పొలాలకు అపార నష్టం వాటిల్లింది. నిడమనూరు పట్టణంలోని ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ మినీ గురుకుల పాఠశాలలోకి వరద నీరు చేరే క్షణాల ముందే విద్యార్థినులు బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది.
వరద తగ్గడంతో గురువారం తెల్లవారుజామున నిడమనూరు – మిర్యాలగూడ ప్రధాన రహదారిపై రాకపోకలను పునరుద్ధరించారు. సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే నేతృత్వంలోని అధికారుల బృందం ఎమ్మెల్యే నోముల భగత్కుమార్తో కలిసి గురువారం గండి ప్రదేశాన్ని పరిశీలించారు. గండి మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదిక న చేపడుతున్నట్టు మంత్రి జగదీశ్రెడ్డి తెలిపా రు. గండిపడిన సమాచారం అందిన వెంటనే అధికారులు నీటి విడుదలను నిలిపివేశారన్నా రు. లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీటిని సైతం బయటకు పంపగలిగామని, తద్వారా పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. నష్టపోయిన వారిని ఆదుకొంటామని తెలిపారు.