హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): వైద్యులు మనకు కనిపించే దేవుళ్లని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టరందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా మార్చేందుకు వైద్యులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ భూమిపై ప్రజల ప్రాణాలను కాపాడగలిగే శక్తి వైద్యులకు మాత్రమే ఉన్నది. అందుకే వాళ్లు మనకు కనిపించే దేవుళ్లు. జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వారికి నా కృతజ్ఞతలు. శుభాకాంక్షలు. కొవిడ్ సమయంలో వైద్య సిబ్బంది చూపిన తెగువను మానవ సమాజం ఎప్పటికీ మర్చిపోదు. ఇందుకు థ్యాంక్యూ చెప్తే సరిపోదు.
వారి త్యాగాలను గౌరవించాలి. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానల్లోని వైద్యులు తమ శక్తికి మించి, అందుబాటులో ఉన్న వనరులతో రోగులకు ఉత్తమ వైద్యం అందిస్తున్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో ముందు వరుసలో నిలిచి ప్రజల ప్రాణాలను కాపాడిన వైద్యుల సేవకు గుర్తింపుగా ఈ సంవత్సరం ‘ఫ్యామిలీ డాక్టర్స్ ఆన్ ది ఫ్రంట్లైన్’ థీమ్తో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించుకొంటున్నాం. రోగులను ఆరోగ్యవంతులను చేయడానికి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి సర్వశక్తులు ఒడ్డుతున్న వైద్యులందరికీ నా సెల్యూట్’ అని పేర్కొన్నారు. తెలంగాణ ఆరోగ్య రంగాన్ని దేశంలోనే నం.1గా నిలిపి, ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు కలిసి పనిచేయాలని కోరారు.