జనగామ, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్ల నుంచి తెలంగాణకు చేసిందేమిటో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించాలని, జనగామ నియోజకవర్గానికి ఏం చేస్తావో చెప్పి ఇక్కడ అడుగు పెట్టాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే ఇదే యాత్రను ఢిల్లీ వరకు కొనసాగించి నిధులు, ప్రాజెక్టులు సాధించుకు వస్తే తామంతా స్వాగతిస్తామన్నారు. నిధులు తేలేని పక్షంలో పార్టీ అధ్యక్ష పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం జనగామలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముత్తిరెడ్డి మాట్లాడారు.
తెలంగాణకు తెచ్చిన నిధులెన్ని? సాధించిన ప్రాజెక్టుల ఏవీ? విభజన హామీల్లో ఎన్నింటిని అమలు చేశారు? వాటిలో ఇప్పటివరకు పూర్తి చేసిన పనులేంటో ప్రజలకు సమాధానం చెప్పి పాదయాత్రకు వస్తే తాము సాదరంగా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఉచితాలను హేళన చేసి అభివృద్ధి, సంక్షేమాలపై గాలిమాటలు చెబితే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్న బీజేపీకి ప్రజాబలం లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న సీట్లు కూడా రావన్నారు. మునుగోడు ఉపఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్సేనని స్పష్టంచేశారు. కనీసం బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సైతం నిధులు మంజూరు చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారని మండిపడ్డారు.
జనగామ పట్టణానికి జిల్లా ఆకృతి తెచ్చేందుకు ఎన్ని కోట్ల కేంద్ర నిధులు తెస్తావో చెప్పు? పట్టణంలో భూగర్భ డ్రైనేజీ కోసం ప్రతిపాదించిన 120 కోట్లు కేంద్రం నుంచి తెస్తానని హామీ ఇవ్వాలని ముత్తిరెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని సవాల్ చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ద్వారా జనగామ మున్సిపాలిటీ రూ.150 కోట్లు తెస్తానని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.