Munnurukapulu | తెలంగాణలోని మున్నూరు కాపు సంఘాలన్నీ సంఘటితం అయ్యాయి. ఏకతాటిపైకి వచ్చాయి. ఈ నెల తొమ్మిదో తేదీ ఉదయం 7:40 గంటలకు హైదరాబాదులోని కోకాపేటలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టనున్నాయి. విద్య, వైద్యం, వ్యాపార తదితర రంగాల్లో మున్నూరు కాపులు సమగ్ర అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సారథ్యంలో ప్రభల శక్తిగా ఎదుగుతున్నాయి. ఆదివారం హైదరాబాద్లోని మంత్రి గంగుల నివాసంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిద మున్నూరు కాపు సంఘాలు సమావేశమయ్యాయి.
ఆత్మగౌరవ భవన నిర్మాణం, ఏకసంఘంగా ఏర్పడే ట్రస్ట్ విధి విధానాలు, భవిష్యత్లో మున్నూరు కాపుల సంక్షేమం కోసం తీసుకునే చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. తొమ్మిదో తేదీన మున్నూరుకాపుల ఆత్మ గౌరవ భవన శంకుస్థాపనతోపాటు రాష్ట్రంలోని మున్నూరు కాపు సోదరులంతా హాజరయ్యే విధంగా సభ నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు సంఘాల జిల్లా అధ్యక్షులు, జిల్లాల కమిటీలు, మండలాల అధ్యక్షులు, మండల కమిటీలు, గ్రామ స్థాయి అధ్యక్షులు, అన్ని గ్రామాల కమిటీలు, నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీల సభ్యులు, ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ హాజరవ్వాలని మంత్రి గంగుల ఆహ్వానించారు. అల్పాహారం, భోజనంతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చే వారికోసం అన్ని రకాల ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నామన్నారు.
కుల అభివృద్ది కోసం, రాబోయే భవిష్యత్ తరాలకు అన్ని విధాలుగా అండగా ఉండడం కోసం మున్నూరుకాపులంతా కలిసికట్టుగా ఉండాలన్నారు. సమాజ శ్రేయస్సును కోరే మున్నూరు కాపుల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మేహన్, కాచిగూడ మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు మానికొండ వెంకటేశ్వరరావు నాయకులు మంగళారపు లక్ష్మణ్, కొండూరి వినోద్, సునీల్ కుమార్, రాష్ట్ర మున్నూరుకాపు సంక్షేమ సంఘం తదితర సంఘాల నేతలు పాల్గొన్నారు.