యాదాద్రి, సెప్టెంబర్ 5: యాదాద్రిలో రూ.30 కోట్లతో నిర్మించిన శ్రీలక్ష్మీనరసింహస్వామి మున్నూరుకాపు నిత్యాన్నదానం సత్రం చారిటబుల్ ట్రస్ట్ భవనాన్ని ట్రస్ట్ చైర్మన్, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నేతి మాట్లాడుతూ.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అధునాతన భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉన్నదన్నారు. భవన నిర్మాణానికి సహకరించిన ట్రస్టు సభ్యులు, మున్నూరుకాపు కులస్థులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరు కాపు ట్రస్టు సభ్యులు సర్దార్ పుట్టం పురుషోత్తం, సంఘం నాయకులు పాల్గొన్నారు. ట్రస్ట్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మున్నూరు కాపులకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అభినందనలు తెలిపారు.