తెలంగాణను శత్రువులా చూస్తున్నారు
ధాన్యానికి 2.37 లక్షల కోట్లు చాలవు
మోదీ సర్కార్పై ఎంపీ రంజిత్రెడ్డి ఫైర్
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ విధానమేదీ లేదని ఎంపీ రంజిత్రెడ్డి ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణతోపాటు కనీస మద్దతు ధరపై జాతీయ విధానం ఉండాలని యావత్ దేశం కోరుతున్నా మోదీ సర్కార్ పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. బుధవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణభవన్లో ఎంపీ వెంకటేశ్ నేతకానితో కలిసి మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణకు రూ.2.37 లక్షల కోట్లు కేటాయించినట్టు కేంద్రం చెప్తున్నప్పటికీ ఆ మొత్తం ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు. పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం కేటాయించిన రూ.68 వేల కోట్లను దేశమంతటా ఖర్చుపెడితే.. తెలంగాణలో రైతుబంధు కిందే రూ.50.60 వేల కోట్లు ఖర్చుచేశామని వివరించారు. రాష్ర్టాన్ని శత్రువులా చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. బడ్జెట్లో తెలంగాణకు ఏమీ ఇవ్వకుండా మొండిచెయ్యి చూపిందని నిప్పులు చెరిగారు. త్వరలో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్కు రూ.49 వేల కోట్లు ఇచ్చారని, కర్ణాటకకూ ఇవ్వబోతున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో అద్భుతంగా పురోగమిస్తున్న తెలంగాణను కేంద్రం ప్రోత్సహించకుండా తీరని అన్యాయం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను ఏం చేయదలచుకొన్నారని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. అంతకుముందు ఎంపీ రంజిత్రెడ్డి లోక్సభలో మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నదని విమర్శించారు.
ప్రధాని మోదీకి దశ, దిశా లేదని ఎంపీ వెంకటేశ్ నేతకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని, ప్రత్యేకించి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలన్న చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు. తెలంగాణలో పండిన పంటను కొనుగోలు చేయలేని అసమర్థ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నదని మండిపడ్డారు.