సిరిసిల్ల నేతన్న చౌరస్తా, జూన్ 19: తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని.. కుల, మత ఆధిపత్యాన్ని ఈ నేల సహించదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వాన ఎనిమిదేండ్లలో అభివృద్ధి విప్లవంలా కొనసాగిందని చెప్పారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలో గౌరీశంకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు గొప్ప చారిత్రక నేపథ్యమున్నదన్నారు. భూమికోసం, భుక్తికోసం, అస్థిత్వం కోసం సాగించిన ఉద్యమాలన్నీ విజయవంతమయ్యాయని చెప్పారు. 14 ఏండ్లపాటు సాగిన ప్రత్యేక రాష్ట్ర పోరు ప్రతి ఒక్కరిలో చైతన్యస్ఫూర్తిని రగిలించిందన్నారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తుంటే ఓర్వలేని కొన్ని శక్తులు చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు.
అలాంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా, ఐటీరంగంలో హైదరాబాద్ను మేటిగా నిలిపిన మంత్రి కేటీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. అనంతరం మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో గూడూరి సీతారాం కథా పురస్కారాన్ని ప్రముఖ రచయిత పూడూరి రాజిరెడ్డికి ప్రదానం చేసి సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరి ప్రవీణ్, అఖిల భారత తెలంగాణ రచయిత వేదిక అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, మానేరు రచయితల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పత్తిపాక మోహన్ తదితరులు పాల్గొన్నారు.