బోయినపల్లి, జూన్ 30: కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ముగ్గురు పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కొదురుపాక హైలెవల్ వంతెన సమీపంలో శ్రీరాజరాజేశ్వర జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నది. వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వంకాయల రజిత (28), కరీంనగర్లోని సుభాష్నగర్కు చెందిన మహ్మద్ అలీ తొమ్మిదేండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఎండీ అయాబ్ (7), ఉస్మాన్ హైమద్(14 నెలలు), కూతురు అస్రె జాబిన్(5) ఉన్నారు. పెండ్లి చేసుకున్నప్పటి నుంచి భర్త కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడు. నిత్యం తాగొచ్చి ఇబ్బందులు పెడుతున్నాడు. జూన్ 27న రజిత, పిల్లలను ఆటోలో ఎక్కించుకొని రుద్రవరంలోని తల్లిగారింటి వద్ద దింపి కట్నం తీసుకురావాలని చెప్పి వెళ్లాడు. వెంటనే రజిత, ఆమె తల్లిదండ్రులు వేములవాడ పోలీస్ స్టేషన్కు వెళ్లగా పోలీసులు మహ్మద్ అలీని పిలిపిస్తామని చెప్పి వారిని పంపించారు. 28న మధ్యాహ్నం 12 గంటల సమయంలో రజిత తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శుక్రవారం బోయినపల్లి మండలం కొదురుపాక హైలెవల్ వంతెన పక్కన నీటిలో వీరి నలుగురి మృతదేహాలు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బోయినపల్లి ఎస్సై మహేందర్, ఏఎస్సై బాబు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి ఇరువురి కుటుంబాలకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.