Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో మరోసారి వాయు కాలుష్యం పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 321కి చేరింది. ఎన్సీఆర్ పరిధిలో 27 ప్రాంతాల్లో వాయు కాలుష్యం దారుణంగా ఉండగా.. ఆరు ప్రాంతాల్లో మరింత అధ్వాన్నంగా నమోదైంది. మంగళవారం నాటికి వాయు కాలుష్యం మరింత పెరగవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది.
ఫరీదాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 240, ఘజియాబాద్లో 242, నోయిడాలో 242, గ్రేటర్ నోయిడాలో 260, గురుగ్రామ్లో 251 వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) ప్రకారం.. ఢిల్లీలో శనివారం నైరుతి నుంచి వాయువ్య దిశగా గాలి వీచింది. గంటకు ఆరు నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు పేర్కొంది. ఆదివారం వాయువ్య దిశ నుంచి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
అదే సమయంలో ఉదయం పొగమంచు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ పరిస్థితుల్లో గాలి నాణ్యత మరింత పడిపోయే ప్రమాదం ఉందన్నది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం.. శనివారం ఢిల్లీలోని 27 ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచి పడిపోయింది. నెహ్రూనగర్లో 376, బవానాలో 368, వివేక్ విహార్లో 366, జహంగీర్పురిలో 365, ముండ్కాలో 356, అశోక్ విహార్లో 353 ఏక్యూఐ రికార్డయ్యింది. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3లో 295, శ్రీ అరబిందో మార్గ్లో 283, నజాఫ్గఢ్లో 278, మథుర రోడ్లో 266, దిల్షాద్ గార్డెన్లో 237గా రికార్డయ్యింది.