హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఫలితాలను మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. ఫలితాల్లో 94.14 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు సత్తాచాటారు. 38,712 మంది అమ్మాయిలు పరీక్షకు హాజరుకాగా, 36,437 మంది అర్హత సాధించారు. 18,550 అబ్బాయిలు పరీక్షకు హాజరుకాగా, 17,613 మంది క్వాలిఫై అయ్యారు. మొత్తం 57,262 మంది పరీక్షలకు హాజరుకాగా, వారిలో 54,050 మంది (94శాతం) అర్హత సాధించారు. నిరుడుతో పోలిస్తే ఉత్తీర్ణత రెండు శాతం పెరిగింది.
రాష్ట్రంలోని ఎనిమిది యూనివర్సిటీల్లో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో 45 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. వెబ్ కౌన్సెలింగ్ను వారంలో ప్రారంభించే అవకాశాలున్నాయి. షెడ్యూల్ ఒకట్రెండు రోజుల్లోనే విడుదల కానున్నది. 50 పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 11 నుంచి 23 వరకు సీపీగెట్ పరీక్షలు జరిగాయి. దరఖాస్తులు తక్కువగా రావడంతో పరీక్షతో నిమిత్తం లేకుండానే ఎంఏ అరబిక్, ఎంఏ కన్నడ, ఎంఏ మరాఠి, ఎంఏ పర్షియన్, ఎంఏ థియేటర్ ఆర్ట్స్ కోర్సుల్లో విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్, తెలంగాణ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.