హైదరాబాద్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ): ఖమ్మం మీదుగా వెళ్లే నాగ్పూర్-అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్ను ఖమ్మం కలెక్టరేట్ వద్ద మార్చాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఆయన గురువారం పార్లమెంటు ఆవరణలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రం గుండా వెళ్తున్న జాతీయ రహదారులపై నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. గ్రీన్ఫీల్డ్ ప్రతిపాదిత హైవే ఖమ్మం సమీకృత కలెక్టరేట్ మధ్య నుంచి వెళ్తున్నదని, దాన్ని కలెక్టరేట్ వెనుక నుంచి వెళ్లే విధంగా డిజైన్ను సవరించాలని కోరారు. ఇదే హైవేపై వాహనదారులు, పాదచారుల సౌకర్యార్థం రెండుచోట్ల అండర్పాస్లను నిర్మించాలని కోరారు. ఖమ్మం, విజయవాడ మార్గాల నుంచి వచ్చే వాహనాలు సూర్యాపేట సమీపాన కలిసేచోట ఎన్హెచ్-65పై ఒకటి, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట్ వద్ద మరొక అండర్పాస్ను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన మంత్రి తగిన చర్యలు తీసుకోవాలంటూ వెంటనే అధికారులను ఆదేశించారని ఎంపీ రవిచంద్ర తెలిపారు.