ప్రత్యేక ప్రతినిధి, మే 28 (నమస్తే తెలంగాణ):‘భూమి మన తల్లి.. మనం ఆమె పిల్లలం.. ధరణి మాతను గౌరవించి పచ్చని పర్యావరణాన్ని పరిరక్షించడం మన సంస్కృతిలో భాగం. అది మన ధర్మం. అటువంటి మహత్కార్యాన్ని గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ చేపట్టింది. ఈ అద్భుత కార్యక్రమానికి నేతృత్వం వహించి దేశవ్యాప్తంగా పరిశుభ్రతను కాపాడి, పచ్చదనాన్ని పెంచడానికి చేస్తున్న మీ కృషికి నా హృదయపూర్వక అభినందనలు’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా టీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్కు లేఖరాశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపడుతున్న ప్రకృతి రక్షణ కార్యక్రమాలను తెలుసుకొని తన మనసు ఉప్పొంగిందని ప్రధాని లేఖలో పేర్కొన్నారు. ఎంపీ సంతోష్ వెలువరించిన ‘వృక్షవేదం’ పుస్తకం ప్రజల్లో ప్రకృతి పట్ల మరింత అవగాహన పెంచుతుందని పేర్కొన్నారు. ఒకరు మూడు మొక్కలు నాటి మరోముగ్గురికి గ్రీన్ సవాల్ విసిరి ఆ ముగ్గురు మూడేసి మొక్కలు నాటడం వంటి గొప్ప ఆలోచనతో గ్రీన్ ఇండియా చాలెంజ్ను ప్రారంభించి మంచి ఫలితాలను సాధించారన్న విషయం తెలుసుకొని ప్రధాని ఎంపీ సంతోష్కుమార్కు లేఖ రాశారు. ప్రకృతి పరంగా మన గొప్ప వారసత్వాన్ని కాపాడుకోవటం కోసం కేంద్రప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని లేఖలో గుర్తుచేశారు. కాలుష్యాన్ని నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడటానికి సౌరశక్తి వంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహం, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు చేపడుతున్న చర్యలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం వంటి చర్యలు మంచి ఫలితాలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ విశిష్టతను తెలుపుతూ ఎంపీ సంతోష్ వెలువరించిన ‘వృక్షవేదం’ పుస్తకం గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూరు, ముఖ్యంగా యువత వృక్షవేదం పుస్తకాన్ని చదివి, ప్రకృతి ప్రాధాన్యతను తెలుసుకోవాలని పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనటం ద్వారా దేశవ్యాప్తంగా పచ్చదనం పెంచాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం మరింత వేగాన్ని, విస్తృతిని అందుకోవాలని ఆకాంక్షించారు.
ప్రధాని లేఖ మరింత స్ఫూర్తినిచ్చింది
గ్రీన్ ఇండియా చాలెంజ్ను అభినందిస్తూ ప్రధాని లేఖ రాయడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఎంపీ సంతోష్కుమార్ ట్వీట్ చేశారు. ఇందుకు ఆయన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. లేఖ తమకు మరింత స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. ప్రధాని ఇచ్చిన ప్రోత్సాహంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ప్రధాని కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలని అభ్యర్థించారు. ప్రధాని పాల్గొంటే గ్రీన్ చాలెంజ్ ఉద్యమం మరింత బలోపేతమవుతుందని, హరిత భారత నిర్మాణానికి దోహదపడుతుందని సంతోష్ ఆకాంక్షించారు.
-ఎంపీ సంతోష్ కుమార్