కమ్మర్పల్లి, నిజామాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబ పాలన , అవినీతి(corruption) గురించి మాట్లాడడం అతిపెద్ద జోక్ అని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashant Reddy) పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలంలో బీఆర్ఎస్(BRS) పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ (CM KCR) పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, నరేంద్ర మోదీ(Narendra Modi) ధరలు పెంచి సామాన్యులను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు నరేంద్ర మోదీ అని విమర్శించారు. బడా బాబుల కంపెనీలకు రుణాలు మాఫీ చేసి పేదల డబ్బులు దోచుకుంటున్నారని ఆరోపించారు.
మోదీ పాలనలో రూపాయి విలువ పతనమైందని, సిలిండర్ ధర(cylinder) రూ. 400 నుంచి రూ.1200 పెరిగిందన్నారు. డీజిల్ ధర రూ. 40 నుంచి రూ. వంద దాటిందని పేర్కొన్నారు. దీంతో రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర సరుకుల మీద ప్రభావం చూపుతోందని వెల్లడించారు. ‘ ధరల పెంపుదలతో వచ్చిన డబ్బులతో డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటున్నారు. తెలంగాణలో 4 గురు ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసి దొరికి పోయారు. వారి అవినీతి గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారని’ మండిపడ్డారు.
ప్రధాని మోదీకి దమ్ముంటే అదానీ(Adani) ఉదంతంపై సీబీఐ,ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మోడల్ పాలన, కేసిఆర్ పరిపాలన కావాలని అన్ని రాష్ట్రాల ప్రజల నుంచి డిమాండ్ వస్తోందని ఆయన తెలిపారు. కేసిఆర్ కుటుంబ సభ్యులు ప్రజా ఆమోదంతోనే రాజకీయాల్లో ఉన్నారని మంత్రి వేముల మరోమారు స్పష్టం చేశారు. ప్రజలు అండగా ఉండాలని అడిగే హక్కు కేసీఆర్ కు ఒక్కడికే ఉందన్నారు. సమావేశంలో బీఆర్ జిల్లా ఇన్చార్జి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, డా.మధు శేఖర్, పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.