Ganga Pushkaralu 2023 | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): హిందువులు పవిత్రంగా భావించే జీవనది గంగానది. పరమపావనిగా పిలిచే ఆ నదీజలాల్లో ఒక్కసారి స్నానమాచరిస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. అటువంటి గంగానది పుష్కరాలు శనివారం మొదలుకానున్నాయి. 12 ఏండ్లకు ఒకసారి వచ్చే ఈ పర్వంలో లక్షలాది మంది హిందువులు భక్తిశ్రద్ధలతో గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. భారతదేశానికి జీవనాడి లాంటి గంగానది దశాబ్దాల పాలకుల నిర్ణక్ష్యం కారణంగా కాలుష్యభరితంగా మారింది. హిందూ సెంటిమెంటును ఓటుబ్యాంకుగా భావించే బీజేపీ ప్రభుత్వం గంగానదిని ప్రక్షాళన చేస్తానని ఏండ్ల క్రితమే మాట ఇచ్చింది. గంగా ప్రక్షాళన కోసం నమామి గంగే అనే కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం చేపట్టింది. దీనికోసం తాజాగా రూ.638 కోట్లు విడుదల చేసింది. అయితే, గడిచిన 37 ఏండ్లుగా గంగానదిని శుద్ధిచేస్తున్నా ఇప్పటికీ అది మురుగు కాలువలాగే ఉన్నది. కారణం.. గంగమ్మ కాలుష్యాన్ని పోగొట్టాలన్న చిత్తశుద్ధి కేంద్ర పాలకులకు లేకపోవడమే. 2,525 కిలోమీటర్ల పొడవుతో, 6,921 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గంగానది ప్రవహిస్తున్నది.
దేశ జనాభాలో దాదాపు 40 కోట్లమంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ నదిపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు గంగానది పరీవాహక ప్రాంతం కేంద్రంగా ఉన్నది. వ్యర్థాలను నేరుగా వదులుతుండటంతో నదీజలాలు తీవ్రంగా కలుషితం అవుతున్నాయి. ప్రస్తుతం నదిలో 50 శాతం కలుషిత నీరేనని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇటీవల వ్యాఖ్యానించటం నది దుస్థితికి అద్దం పడుతున్నది. కాగా, నదీ కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఏర్పాటుచేసిన 97 మానిటరింగ్ స్టేషన్లలో 59 స్టేషన్ల దగ్గర నుంచి ‘డౌన్ టు ఎర్త్’ పరిశోధన బృందం గత జనవరిలో విశ్లేషణల కోసం నదీజలాలను సేకరించింది. ఇందులో 42 స్టేషన్ల (71 శాతం) దగ్గర గంగనీరు ప్రమాదకరస్థాయిలో విషతుల్యంగా మారిపోయిందని తేల్చింది.
409 ప్రాజెక్టులు చేపట్టారట!
గంగానది వేగంగా కలుషితమవుతున్నదని అప్పటి ప్రభుత్వం నాలుగు దశాబ్దాల కిందే గుర్తించి శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1986 జనవరి 14న గంగా యాక్షన్ ప్లాన్ (జీఏపీ) ప్రారంభించారు. జీఏపీ కింద 2016 జూన్ నాటికి కేంద్రం గంగా పరిరక్షణకు రూ.6,788.78 కోట్లు మంజూరు చేసింది. అందులో రూ.4,800 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గంగా పరిరక్షణకు అదే ఏడాది జూన్లో ‘నమామి గంగే’ పేరిట కొత్త మిషన్ ప్రారంభించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకూ గంగానది శుద్ధి కోసం 409 ప్రాజెక్టులు చేపట్టినట్టు గత ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించింది. దీనికోసం రూ. 32,912 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది. అయితే, ఈ నిధులన్నీ ఏమయ్యాయో తెలియదు కానీ.. గంగ మాత్రం కాలుష్య కాసారంగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో ఎన్జీటీ గంగా ప్రక్షాళన ప్రణాళికలపై అసహనం వ్యక్తం చేసింది. గడిచిన 37 ఏండ్లుగా గంగను శుద్ధిచేస్తున్నా అది నేటికీ కాలుష్యమయంగానే ఉండటంపై ఎన్జీటీ ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్యం నుంచి నదిని కాపాడేందుకు ప్రారంభించిన గంగా యాక్షన్ ప్లాన్ (జీఏపీ), నమామి గంగే వంటి కార్యక్రమాలేవీ విజయవంతం కాలేదని, ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. అయితే, గంగానది మాత్రం స్వచ్ఛంగా మారిపోయిందంటూ ప్రధాని సహా బీజేపీ పరివారం ప్రచారం చేస్తుండటం హాస్యాస్పదంగా మారింది.
‘నమామి గంగే’ మిషన్కు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇది అందరం గర్వించాల్సిన విషయం. పవిత్రగంగను స్వచ్ఛ గంగగా మార్చడంలో సఫలం అయినందుకు సంతోషంగా ఉన్నది.
– డిసెంబర్ 25, 2022న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి ఇటీవల వెళ్లొచ్చా. గంగమ్మ స్వచ్ఛంగా మారిందంటూ ప్రధాని చేసిన ప్రసంగాలతో నా అంచనాలు రెట్టింపయ్యాయి. అయితే, అక్కడున్న గంగను కండ్లారా చూసిన తర్వాత నా అంచనాలన్నీ పటాపంచలయ్యాయి. గంగస్నానానికి వెళ్లిన నేను.. ఆ కాలుష్యం స్థాయిని చూసి దడుసుకున్న.
– గడ్డం సతీశ్, హైదరాబాద్ నుంచి ఇటీవల కాశీకి వెళ్లొచ్చిన యాత్రికుడు