బీజేపీయేతర రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
కేసీఆర్ వంటి నాయకుడు దేశానికి అవసరం
అసెంబ్లీ ఎన్నికలకు మేము సిద్ధం..
ఎన్నికల తేదీ ప్రకటించే దమ్ము మీకున్నదా?
బీజేపీపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మండిపాటు
నిర్మల్, జూలై 11 (నమస్తే తెలంగాణ): దేశ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోదీ వద్ద సమాధానం లేదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎద్దేవాచేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బీజేపీయేతర రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్న మోదీకి దేశ ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. దేశానికి కేసీఆర్ వంటి మహా నాయకుడి అవసరం ఉన్నదని చెప్పారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కిషన్రావుపేటలో సోమవారం వర్షాలతో చెరువుకు గండి పడగా, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదివారం రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా మాట్లాడిన ప్రసంగాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆసక్తిగా విన్నారన్నారు. ఇంత విశాలమైన ఆలోచనా పరిధి, అపార జ్ఞానం ఉన్న కేసీఆర్ వంటి సమర్థుడైన నాయకుడు దేశానికి అవసరమని ఉద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని, ఎన్నికల తేదీ ప్రకటించే దమ్ము బీజేపీకి ఉన్నదా? అని ప్రశ్నించారు. ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశానికి చేసిందేమిటో చెప్పాలని నిలదీశారు.
మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం, ఇందన సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలకు అవసరమై కరంటు, సాగు, తాగు నీరు, ఉద్యోగాలు, విద్య, ఉపాధి అవకాశాలు పక్కన పెట్టి.. కేవలం మతవిద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పని చేస్తున్నదని విమర్శించారు. దేశ యువత మేల్కొని మోదీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాలు బీజేపీయేతర రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. తమకున్న అధికారం, ఆర్థిక బలంతో బీజేపీయేతర పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో వారి ఆటలు సాగవని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టంచేశారు.